సీఎం సహాయ నిధికి ఐటీ హాస్టళ్ల విరాళం !

by  |
సీఎం సహాయ నిధికి ఐటీ హాస్టళ్ల విరాళం !
X

దిశ, న్యూస్ బ్యూరో :
కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ఐటీ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. అసోసియేషన్ తరపున సీఎం సహాయనిధికి రూ.25 లక్షల చెక్కును పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు సంఘం ప్రతినిధి మహీధర్ బుధవారం అందజేశారు. రాష్ట్రంలో అవసరమైన వారందరికీ ప్రభుత్వం సాయం చేస్తోందని, అందులో భాగం పంచుకోవడం కోసం ఈ సహాయాన్ని అందించినట్టు అసోసియేషన్ తెలిపింది. అంతకుముందు సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఐదు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ సహాయంతో పోలీసు సిబ్బందికి అవసరమైన మాస్కులు, శానిటైజర్ తదితరాలను సమకూర్చడానికి వీలవుతుందని మహీధర్ తెలిపారు.

ఐటీ పరిశ్రమలు కేంద్రీకృతమైన సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అనేక మంది యువత హాస్టళ్ళలో, అద్దె ఇండ్లలో ఉంటున్నారు. కొన్ని అపార్టుమెంట్లు కేవలం ఐటీ ఉద్యోగులకు అద్దెకివ్వడం కోసమే కేటాయించబడ్డాయి. కాగా, నగరంలో ఐటీ ఉద్యోగులకు సుమారు మూడు వేల హాస్టళ్ళు ఉన్నాయని, ఇందులో రెండు వేల హాస్టళ్ళ యజమానులు.. తలా కొంత చొప్పున విరాళం అందించారని, అలా సేకరించిన మొత్తం రూ. 25 లక్షలను సీఎంఆర్ఎఫ్‌కు విరాళంగా ఇచ్చినట్లు మహీధర్ వెల్లడించారు. ఇప్పటికీ హాస్టళ్ళలో ఉంటూ ‘వర్క్ ఫ్రం హోమ్’ విధానంలో పనిచేస్తున్న వేలాది మంది ఐటీ ఉద్యోగులకు కష్టకాలంలో తమ వంతు చేయూతగా ప్రభుత్వానికి సాయం అందించడానికి ఐటీ హాస్టళ్ళ సంఘం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ విరాళాన్ని అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి మహీధర్‌తో పాటు కరుణాకర్ కూడా ఉన్నారు.

Tags: Telangana, IT Hostels Owners Association, CMRF, Corona, Donation, Rs 25 Lakhs

Next Story

Most Viewed