కన్నీటితో పసిపాపను చేరదీసిన.. ఆసుపత్రి సిబ్బంది

by  |
కన్నీటితో పసిపాపను చేరదీసిన.. ఆసుపత్రి సిబ్బంది
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పేగు బంధం తెంచుకుని మరీ జన్మనిచ్చిన ఆ తల్లి మనసు తల్లడిల్లలేదు… ఆ తల్లి కడుపున కవలలు పుట్టగా మగ శిశువు పురిట్లోనే చనిపోయింది. దీంతో తక్కువ బరువుతో ఉన్న ఆడ శిశువును కూడా దవాఖానలోనే వదిలేసి వెల్లిపోయిందా తల్లి. అయినా ఆ ఆసుపత్రి సిబ్బంది అలనా పాలనా చూసుకుంటూ మూడు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడారు. చివరకు ఆ చిన్నారిని ఐసీడీఎస్ సెంటర్‌కు అప్పగిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆసుపత్రి సిబ్బంది. వివరాల్లోకి వెలితే… పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు నెలల క్రితం ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అనారోగ్యంతో పుట్టిన కవలల్లో మగశిశువు మరణించగా, ఆడ శిశువు కేవలం 920 గ్రాముల బరువు మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులు పసికందును ఆసుపత్రిలోనే వదిలేసి వెల్లిపోయారు. అనంతరం ఆసుపత్రి సిబ్బందే అక్కున చేర్చుకున్నారు. అనంతరం తల్లిదండ్రుల కోసం ఆసుపత్రి సిబ్బంది ఆరాతీయగా అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని మళ్ళీ ఆ పాపను పోషించే శక్తి తమకు లేదని వదిలి వెళ్లినట్టు తెలుసుకున్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బందే అన్ని తామై మూడు నెలల్లో మూడు కిలోల బరువు పెరిగేలా పౌష్టికాహారం అందించి సఫలం అయ్యారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్న పాపను రామగుండం ఎమ్మెల్యే కొరుకంటి చందర్, మేయర్ అనిల్ కుమార్‌ల సమక్షంలో ఐసీడీఎస్ సెంటర్ అధికారులకు అప్పగించారు. మూడు నెలలుగా చిన్నారిని తమ ఇంట్లో పుట్టిన పాపలా పెంచిన ఆసుపత్రి సిబ్బంది కంట తడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందిని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అభినందించారు.


Next Story