సూర్యాపేటలో హైటెన్షన్.. వణికిపోతున్న ప్రజలు

by  |
సూర్యాపేటలో హైటెన్షన్.. వణికిపోతున్న ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఓ ఇంట్లో ఏకంగా 22 మందికి పాజిటివ్ రిపోర్ట్ రావడంతో జిల్లా ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. గతంలో మర్కజ్ వెళ్లి వచ్చిన వ్యక్తి ద్వారా వందల మందికి కరోనా సోకిన విషయం తెలిసిందే. దీంతో అప్పుడు జిల్లా రెడ్ జోన్ లోకి వెళ్లింది. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో కరోనా విజృంభిస్తుండడంతో పట్టణవాసులు కలవరానికి గురవుతున్నారు.

సూర్యాపేట పట్టణంలో యాదాద్రి టౌన్ షిప్ లోని ఓ ఇంట్లో ఇటీవల ఒకరు మృతిచెందారు. ఆయన అంత్యక్రియలకు వందలాది మంది బంధువులు హాజరయ్యారు. అయితే మృతిచెందిన వ్యక్తి కుమారుడికి తండ్రి అంత్యక్రియల అనంతరం కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు కొవిడ్ పరీక్షలు చేయించడంతో 22 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. అంత్యక్రియలకు హాజరైన వారి వివరాలు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు. సూర్యాపేట డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ సిబ్బంది యాదాద్రి టౌన్ షిప్ లో సర్వే చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి కరోనా టెస్టులు చేసేందుకు వైద్యశాఖ సిద్ధమవుతోంది.

Next Story

Most Viewed