రెండో సెమీస్ కూడా డ్రా

by  |
రెండో సెమీస్ కూడా డ్రా
X

దిశ, స్పోర్ట్స్ : ఐఎస్ఎల్ 2020/21 సీజన్ ఫస్ట్ లెగ్ రెండో సెమీస్ ఈరోజు జీఎంసీ స్టేడియంలో ఏటీకే మోహన్‌బగాన్, నార్త్ఈస్ట్ యునైటెడ్ క్లబ్ మధ్య జరిగింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ చివరకు 1-1 తేడాతో డ్రాగా ముగిసింది. టాస్ గెలిచిన నార్త్ఈస్ట్ యునైటెడ్ కుడి నుంచి ఎడమకు కిక్ చేయడానికి నిర్ణయించుకుంది. మొదటి నుంచి హోరాహోరీగా తలపడుతూ బంతిని తమ నియంత్రణలో ఉంచుకోవడానికి ప్రయత్నించడంతో అరగంట వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

32వ నిమిషంలో రాయ్‌కృష్ణ ఇచ్చిన పాస్‌ను డేవిడ్ విలియమ్స్ గోల్‌గా మలిచి ఏటీకే మోహన్‌బగాన్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత ఇరు జట్లు మరోగోల్ చేయలేదు. నార్త్ఈస్ట్ యునైటెడ్ గోల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నది. మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో ముగుస్తుంది అనగా లూయీస్ మచాదో ఇచ్చిన పాస్‌ను ఇంద్రిస్సా సైలా గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు.

టోర్నీ నుంచి అవుట్ అనుకున్న నార్త్ఈస్ట్ ఆశలను సజీవంగా ఉంచాడు. మ్యాచ్ 1-1తో డ్రాగా ముగియడంతో ఫైనల్ బెర్త్ కోసం రెండో లెగ్‌లోని మరో సెమీస్ వరకు ఎదురు చూడాల్సిందే. డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు రాయ్ కృష్ణ, హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గుర్జీందర్ కుమార్‌కు లభించింది.


Next Story

Most Viewed