ప్రభుత్వానికి షాక్.. అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

by  |
ప్రభుత్వానికి షాక్.. అమరావతి రైతుల పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి రైతులు చేపట్టనున్న న్యాయస్థానం టూ దేవస్థానం మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. రాజధాని రైతుల మహాపాదయాత్రకు డీజీపీ గౌతం సవాంగ్ అనుమతి నిరాకరించడంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది ఇవి లక్ష్మీనారాయణ వాదించారు. పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని కోర్టుకు తెలిపారు. అయితే రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని న్యాయవాది ఇవి లక్ష్మీనారాయణ వాదించారు. ఇరువాదనలు విన్న ధర్మాసనం మహాపాదయాత్రకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.

పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు: అమరావతి పరిరక్షణ యువజన సంఘం

అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు డీజీపీ అనుమతి ఇవ్వకుండా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని అమరావతి పరిరక్షణ యువజన జాక్ అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ ఆరోపించారు. అమరావతిలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ అమరావతిని విచ్చిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న ఉద్యమం 682 రోజులకు చేరినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని యువత, విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని దుయ్యబట్టారు. పాదయాత్రలో పాల్గొనడానికి యువత ముందుకు రావాలని సాయికృష్ణ కోరారు. ఇకపోతే నవంబర్ ఒకటి నుంచి ఈ మహాపాదయాత్ర ప్రారంభం కానుంది. రాష్ట్ర హైకోర్టు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఈ పాదయాత్ర కొనసాగనున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed