చైర్మన్ ఆదేశాలను ఈవో పాటించాల్సిందే.. హైకోర్టు కీలక తీర్పు

by  |
చైర్మన్ ఆదేశాలను ఈవో పాటించాల్సిందే.. హైకోర్టు కీలక తీర్పు
X

దిశ, ఏపీ బ్యూరో: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో చైర్మన్ ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. తనకు ఈవో సహకరించడం లేదని..అలాగే ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదని ఆరోపిస్తూ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ అశోక్ గజపతిరాజు తరపున న్యాయవాదులు సీతారామమూర్తి, అశ్విన్ కుమార్‌లు వాదనలు వినిపించారు. చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆదేశాలను ఈవో పాటించాల్సిందేనంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

చైర్మన్ ఆదేశాలను ఈవో ఉల్లంఘించడం సరికాదని అభిప్రాయపడింది. ట్రస్ట్ అకౌంట్స్ సీజ్ చేయాలన్న ఈవో ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. అలాగే పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలన్న ఈవో ఆదేశాలను సైతం సస్పెండ్ చేసింది. మరోవైపు ట్రస్ట్‌కు సంబంధించిన ఇనిస్టిట్యూషన్స్ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని తెలిపింది. ఈ సందర్భంగా ఈవో వ్యవహారశైలిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. మాన్సాస్‍లో ఆడిట్ పేరుతో ఇతరులు జోక్యం చేసుకోరాదని..కేవలం జిల్లా ఆడిట్ అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని సూచించింది.


Next Story

Most Viewed