మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు

by  |
TS-High-Court
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం మల్లన్నసాగర్ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీ ఇచ్చేంతవరకు వారి ఇండ్లను కూల్చరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ముంపు గ్రామాల్లోని ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులకు పూర్తిగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, ఆ తర్వాతనే వారి ఇండ్లను తొలగించాలని ఆదేశించింది. బాధిత కుటుంబాలకు చెందినవారు ఆధార్ లాంటి గుర్తింపు కార్డులను తీసుకుని జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్ళాలని, ప్యాకేజీ సాయాన్ని తీసుకోవాలని పేర్కొన్నది. మల్లన్నసాగర్ పరిధిలోని ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్ తదితర గ్రామాలకు చెందిన బాధితులు గతంలో దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు పై ఆదేశాలు జారీచేసింది.

కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది వాదిస్తూ, పిటిషన్‌లు చాలా కాలంగా హైకోర్టులో విచారణలో ఉన్నాయని, ఒంటరిగా ఉన్న బాధితులకు చెక్కుల రూపంలో పూర్తి పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని డివిజన్ బెంచ్‌కు స్పష్టం చేశారు. హైకోర్టు జోక్యం చేసుకుని పిటిషన్లు వేసినవారు మాత్రమే కాక ముంపు ప్రాంతాల్లో బాధితులుగా ఉన్న కుటుంబాలన్నింటికీ దీన్ని వర్తింపజేయాలని, వారికి కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని పూర్తి స్థాయిలో ఇవ్వాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ సాయాన్ని అందజేసిన తర్వాత రాతపూర్వకంగా వివరాలన్నింటినీ తెలిజేయాలని ఆదేశించి తదుపరి విచారణను జూలై 9వ తేదీకి వాయిదా వేసింది.

Next Story