తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్ .. డెడ్ లైన్ విధించిన హైకోర్ట్

by  |
తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్ .. డెడ్ లైన్ విధించిన హైకోర్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని, కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడంలేదని వ్యాఖ్యానించింది. కేసుల సంఖ్య, వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్ విధించే దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించింది. కరోనా కట్టడికి సంబంధించి బుధవారం జరిగిన విచారణకు డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ స్వయంగా హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు వీరిద్దిరపై ప్రశ్నల వర్షం కురిపించింది.

కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను ఎందుకు పెంచడంలేదని ప్రశ్నించింది. గత విచారణ సందర్భంగా రోజుకు రాష్ట్రం మొత్తం మీద కనీసంగా లక్ష టెస్టుల్ని చేయాలని ఆదేశించామని, అయినా ఇటీవలి కాలంలో ఆ మేరకు టెస్టులు జరగడంలేదని గుర్తుచేసింది. నైట్ కర్ప్యూ పెట్టామని డీజీపీ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నైట్ కర్ఫ్యూ మొక్కుబడిగానే అమలవుతోందని, దీని వల్ల కేసులు సంఖ్య తగ్గడానికి బదులుగా ఎందుకు పెరుగుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది.

రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగినందున ఆక్సిజన్ డిమాండ్ కూడా అంతే పెరిగిందని, ప్రస్తుతం ఏ స్థాయిలో డిమాండ్ ఉందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను ప్రశ్నించింది. దీనికి స్పందించిన డాక్టర్ శ్రీనివాసరావు, ప్రస్తుతం రాష్ట్రంలో 600 టన్నుల మేర ఆక్సిజన్ డిమాండ్ ఉందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 430 టన్నులనే ఇచ్చిందని వివరించారు. కర్ణాటక, ఒరిస్సా నుండి ఆక్సిజన్‌ను తెప్పించుకుంటున్నామని వివరించారు. తమిళనాడు నుండి రావాల్సిన 55 టన్నుల ఆక్సిజన్ ఇంకా రాలేదన్నారు. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలసిందేనని హైకోర్టు ఆదేశించింది. అలానే ఔషద అక్రమ విక్రయాల పై కఠినంగా వ్యవహరించాలంది. దీనికి డీజీపీ సమాధానం ఇస్తూ ఔషధాల అక్రమ విక్రయాలకు సంబంధించి 39 కేసులు నమోదుచేశామని తెలిపారు. ఫంక్షన్‌ హాళ్లు, పార్కులు, మైదానాల్లో ఆకస్మిక తనిఖీలకు ఆదేశించింది. అలాగే ఆర్టీపీసీఆర్‌ ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వన్ని హెచ్చరించింది. ఏపీ నుంచి రాకపోకలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంది. తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది.

Next Story

Most Viewed