గో మహాగర్జనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

by  |
గో మహాగర్జనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో : యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో జరగనున్న ‘గో మహాగర్జన’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని షరతులను విధించింది. ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం జరగనున్న ఈ కార్యక్రమానికి గరిష్టంగా 400 మంది హాజరుకావచ్చని, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొవిడ్ నిబంధనలను పాటించాలని, సోషల్ డిస్టెన్స్ అమలుచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. తొలుత పోలీసులు ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఆ అనుమతిని వెనక్కి తీసుకోవడంతో యుగ తులసి ఫౌండేషన్ నిర్వహాకులు హైకోర్టును ఆశ్రయించారు.

ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్ హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పోలీసులు అనుమతి ఇచ్చినా తర్వాత దాన్ని ఉపసంహరించుకోవడాన్ని సవాలుచేశారు. పిటిషన్‌ను విచారణకు తీసుకున్న హైకోర్టు మధ్యాహ్నం తర్వాత దాన్ని విచారించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు హాజరైన న్యాయవాది వాదిస్తూ, కరోనా సమయంలో సినిమా థియేటర్లకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి కొనసాగుతున్నప్పుడు భారీ గ్రౌండ్‌లో జరిగే ‘గో మహా గర్జన’కు మాత్రం అనుమతిని ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్ లేవనెత్తిన వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సైతం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఇదే ప్రశ్నించింది.

అన్ని వైపులా వాదనలను విన్న హైకోర్టు యుగతులసి ఫౌండేషన్ నిర్వహిస్తున్న ‘గో మహాగర్జన’కు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది. యధావిధిగా షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 1వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. అయితే కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Next Story

Most Viewed