తెలంగాణ అడ్వొకేట్ జనరల్‌పై హైకోర్టు సీజే ఆగ్రహం

by  |
తెలంగాణ అడ్వొకేట్ జనరల్‌పై హైకోర్టు సీజే ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదిస్తారా అంటూ తెలంగాణ అడ్వొకేట్ జనరల్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమ కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ బెంచ్ ముందుకు విచారణ జరగాలో, ఏ న్యాయమూర్తి దగ్గర వద్దో న్యాయవాదులే డిసైడ్ చేస్తారా అని ప్రశ్నించారు. న్యాయమూర్తులపైన, హైకోర్టు బెంచ్‌లపైన నమ్మకం లేకపోతే పిటిషన్‌ను ఉపసంరించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇకపైన పిటిషన్ ఏ బెంచ్‌ ముందుకు వెళ్ళాలో సీజేగా తానే డిసైడ్ చేస్తానని స్పష్టం చేశారు. కృష్ణా జలాల విషయం రోజుకో మలుపు తిరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని డెల్టా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు సీజే మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

కృష్ణా నది జలాల విషయంలో డెల్టా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ క్రమంలో ఇరువైపుల న్యాయవాదులూ గందరగోళం సృష్టిస్తున్నారని చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఉద్ద్యేశాలు ఆపాదించడం తగదని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వేదుల వెంకటరమణ తీరుపైనా సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు బెంచ్ వద్దనే విచారణ జరగాలంటూ ఎందుకు కోరారని ప్రశ్నించారు. ఫలానా న్యాయమూర్తి దగ్గర లేక ఫలానా బెంచ్ దగ్గరే విచారణ జరగాలని కోరే పద్ధతి సమంజసం కాదని స్పష్టం చేశారు.

తెలంగాణ అడ్వొకేట్ జనరల్ తీరును నొక్కిచెప్పిన చీఫ్ జస్టిస్ హిమ కోహ్లి, న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదించడం, నిర్దిష్టంగా ఒక బెంచ్‌పై మంచి అభిప్రాయం లేకపోతే పిటిషన్‌ను ఉపసంహరించుకోవచ్చని సూచించారు. దీనికి స్పందించిన తెలంగాణ ఏజీ మధ్యంతర పిటిషన్‌ను వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు. ఇకపైన ఏ బెంచ్ ముందు విచారణ జరపాలో స్వయంగా తానే నిర్ణయిస్తానని, ఆ ప్రకారం విచారణ ఎప్పుడు ఉంటుందో తేదీలను తెలియజేస్తానని ఇరు తరపు న్యాయవాదులకు స్పష్టం చేశారు.

వివరాల్లోకివెళ్తే… డెల్టా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవాలని, సీజే ధర్మాసనం ముందు విచారణ జరగాలంటూ తెలంగాణ అడ్వొకేట్ జనరల్ వాదించారు. దీనికి ఘాటుగానే స్పందించిన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, అడ్వొకేట్ జనరల్ ఇంత పేలవంగా ఆలోచిస్తారని ఊహించలేదని, ఈ విషయంలో చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొని మంగళవారానికి ఈ పిటిషన్ విచారణను వాయిదా వేశారు.

ఆ ప్రకారం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ మొదలైంది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మరోసారి ప్రస్తావించారు. రోస్టర్ ప్రకారం ఈ పిటిషన్ చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి వెళ్తుందని వాదించారు. ఈ విషయాన్ని నేరుగా సీజేకే విన్నవించుకోవాలని ఏజీకి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు సూచించారు. సీజేతో చర్చించిన విషయాన్ని ప్రస్తావించిన ఏజీ, విచారణను చేపట్టిన తర్వాత మళ్ళీ అభ్యంతరాలేంటని ప్రశ్నించారు. సీజే నుంచి స్పష్టత తీసుకుని చెప్తామని ఏజీకి తెలిపారు. చివరకు తెలంగాణ తన మధ్యంతర పిటిషన్‌ను ఉపసంహరించుకున్నది. తదుపరి విచారణ ఎప్పుడు జరిగేదీ సీజే వెల్లడించనున్నారు.



Next Story

Most Viewed