సరిహద్దుల్లో హై అలర్ట్

by  |
సరిహద్దుల్లో హై అలర్ట్
X

దిశ, కరీంనగర్: కరోనా కారణంగా లాక్ డౌన్ లో బిజీగా ఉన్న పోలీసులను నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. ఓ వైపున క్వారంటైన్‌ల వద్ద గస్తీ, మరో వైపున కరోనా అనుమానితుల గాలింపు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు సరిహద్దు ఠాణాలపై దాడులే లక్ష్యంగా వ్యూహ రచన చేసినట్టు నిఘా వర్గాలు కీలక సమచారం అందుకున్నాయి. పోలీసుల దృష్టి అంతా కూడా లాక్ డౌన్ బందోబస్తు పైనే ఉండడం తమకు అనుకూల సమయమని మావోయిస్టు పార్టీ భావిస్తోందని, ఇందులో భాగంగా మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంత పోలీస్ స్టేషన్లపై మావోలు దాడులు చేసేందుకు పథక రచన చేసుకున్నారని గుర్తించిన ఇంటలీజెన్స్ వర్గాలు మూడు రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లా, చత్తీస్‌ఘడ్‌లోని పూర్వ బస్తర్ జిల్లాలోని ఏదో ఓ స్టేషన్ పై ముప్పేట దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని అలర్ట్ చేయడంతో సరిహద్దుల్లో జాయింట్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. మూడు రాష్ట్రాలను ఆనుకుని ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల పరివాహక ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. పారా మిలటరీ బలగాల సాయంతో పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. ఆయా రాష్ట్రాల సీనియర్ పోలీసు అధికారులు కో ఆర్డినేషన్ చేస్తూ జాయింట్ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. మావోలు తెలంగాణలోకి అడుగు పెట్టకుండా ఉండేందుకు ఇక్కడి పోలీసు బలగాలు ముందస్తు చర్యలు తీసుకున్నాయి. భూపాలపల్లి ఓఎస్డీ కాళేశ్వరం నుంచి ముకునూరు వరకు పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.

ఆ దారే కీలకం

తెలంగాణ ప్రాంతంలోకి మావోలు అడుగు పెట్టేందుకు మేడిగడ్డ బ్యారేజి నుంచి ఇంద్రావతి నది గోదావరిలో కలిసే దమ్మూరు వరకు నదిలో చుక్కనీరు లేకుండా పోయింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరంతా కూడా మేడిగడ్డ వద్ద నిలువ చేస్తుండడంతో దమ్మూరు వరకు నీరు లేక గోదావరి నుంచే రాకపోకలు సాగుతున్నాయి. ఈ ప్రాంతానికి అవతలి వైపున మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల సరిహద్దులు ఉండడంతో అక్కడి నుంచే మావోయిస్టులు తెలంగాణలోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన పోలీసు అధికారులు ఆ ప్రాంతంపై డేగ కళ్లతో నిఘా చేపట్టారు.

ఆ టూర్ వెనక కారణం?

పది హేను రోజుల క్రితం ఇదే ప్రాంతం మీదుగా మావోయిస్టులు రాష్ట్రంలోకి నిరాయుధులుగా చొరబడ్డారని గుర్తించిన పోలీసులు సరిహద్దు జిల్లాల్లో కూంబింగ్ నిర్వహించారు. అయితే అప్పుడు మఫ్టీలో తెలంగాణలోకి వచ్చిన మావోలు ఎదైనా స్టేషన్ వద్ద రెక్కీ నిర్వహించి వెళ్లారన్న అనుమానంతో ఒకప్పుడు ప్రభావిత ప్రాంతాల్లోని స్టేషన్లలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

tag; Maoists, high alert, borders, ts news

Next Story