14 శాతం పెరిగిన హీరో మోటోకార్ప్ లాభాలు

by  |
14 శాతం పెరిగిన హీరో మోటోకార్ప్ లాభాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద టూ-వీలర్ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 13.7 శాతం పెరిగి రూ. 1,029.17 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 905.13 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 9,827.05 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ. 7,074.86 కోట్లుగా నమోదు చేసినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కార్యకలాపాల ఆదాయం రూ. 6,966.73 కోట్ల నుంచి రూ. 9,775 కోట్లకు పెరిగింది. ‘2020-21 ఆర్థిక సంవత్సరానికి మూడో త్రైమాసికంలో కంపెనీ పనితీరు మెరుగ్గా ఉందని, కరోనా సవాళ్లు, అస్థిర వ్యాపార వాతావరణం ఉన్నప్పటికీ మెరుగైన పనితీరును కొనసాగిస్తామనే నమ్మకం ఉందని’ హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి పలు ఉత్పత్తుల శ్రేణిలపై ధరల పెరుగుదల వ్యయం ఒత్తిళ్లను కలిగించినప్పటికీ, ఖర్చు, ఆదాపై మరింత దృష్టి సారించనున్నట్టు ఆయన వెల్లడించారు. కంపెనీ బోర్డు ప్రతి షేర్‌కు రూ. 65 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కాగా, ఇటీవల జనవరి 21న హీరో మోటోకార్ప్ 10 కోట్ల యూనిట్ల ఉత్పత్తిని అధిగమించిన సంగతి తెలిసిందే.

మహీంద్రా లాభాలు 40 శాతం అప్…

దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 40 శాతం పెరిగి రూ. 531 కోట్లకు చేరుకుంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 16 శాతం పెరిగి రూ. 14,057 కోట్లకు చేరుకుంది. గ్రామీణ మార్కెట్లో బలమైన వృద్ధి ఉండటంతో ట్రాక్టర్ అమ్మకాలు 19.6 శాతం పెరిగాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందనే భరోసా ఉందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. సెమీ కండక్టర్, ఉక్కు కొరత కారణంగా ఉత్పత్తి డిమాండ్ కంటే తక్కువగా ఉన్నప్పటికీ యుటిలిటీ వాహనాల వ్యాపారం 11 శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ వెల్లడించింది.


Next Story