లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇవే..

by  |
లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇవే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కేబినెట్​ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం కేసీఆర్​ అధ్వర్యంలో మొదలైన కేబినెట్​ సమావేశం సాయంత్రం ముగిసింది. అనంతరం లాక్​డౌన్​పై మార్గదర్శకాలను జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

– మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది.

– మే 20వ తేదీన కేబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.

– యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించింది.

– ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​కు ఆదేశాలిచ్చారు.

– అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం.

– రెమిడిసివిర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో కేబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడి రాష్ట్రానికి తగిన మందులు సరఫరా చేయాలని సీఎం కోరారు.

– ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు.

లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించిన రంగాలు..

– వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్​సీఐకి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్​డౌన్​ వర్తించదని కేబినెట్​ తీర్మానించింది. ధాన్యం కొనుగోళ్లు యథాతథంగా నిర్వహించాలని సూచించారు.

– వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.

– గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా సాగుతుంది.

– విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యథావిధిగా పనిచేస్తాయి.

– జాతీయ రహదారుల మీద రవాణా యథావిధిగా కొనసాగుతుంది.

– జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.

– కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు.

– ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు.

– ఉపాధిహామీ పనులు యథావిధిగా కొనసాగుతాయి.

– ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి.

– గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి.

– అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెండ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి.

– అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి మాత్రమే అనుమతి.

– తెలంగాణ చుట్టూ రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం.

– ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.

– ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.

– కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా యథావిధిగా కొనసాగుతుంది.

– సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంలు మూసి వేయాలని కేబినెట్ నిర్ణయించింది.
ఈ మినహాయింపులను పూర్తిస్థాయిలో కొవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని కేబినెట్ ఆదేశించింది.

Next Story

Most Viewed