ముసారాంబాగ్ వంతెనకు పగుళ్లు.. ప్రాణం పోతేకాని పట్టించుకోరా..?

by  |
ముసారాంబాగ్ వంతెనకు పగుళ్లు.. ప్రాణం పోతేకాని పట్టించుకోరా..?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గత రెండేళ్లుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ముసారాంబాగ్ వంతెనపై పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై పగుళ్లు ఏర్పడి పెచ్చులు లేచిపోవడంతో కిందిభాగంలో ప్రవహిస్తున్న మూసీ నీరు పైకి కనబడుతోంది. పెద్ద వాహనాలు వెళ్లే క్రమంలో ఈ పగుళ్లు మరింత పెరిగితే, ఏ క్షణమైనా పూర్తిగా కూలే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే భారీ ప్రాణనష్టం చోటు చేసుకునే ప్రమాదం పొంచి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండేళ్లుగా నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షం కురిసిన ప్రతిసారి మూసీలో ప్రవహిస్తున్న వరద నీరు బ్రిడ్జిపై నుండి ఉదృతంగా వెళ్తుండడంతో అక్కడక్కడా దెబ్బతింది.

ఇలా వర్షాలు కురిసి వరద నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న ప్రతిసారి అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేసి తగ్గిన తర్వాత అనుమతిస్తున్నారు. దీంతో వాహనదారులు కూడా ఓ వైపు నుంచి మరోవైపుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వరద తగ్గిన తర్వాత షరా మామూలే అన్నట్లుగా ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో దీనిపై నుండే ప్రమాదకర పరిస్థితులలో ప్రయాణిస్తున్నారు.

గతేడాది అక్టోబర్ లో కురిసిన వర్షాలకు..

గత సంవత్సరం అక్టోబర్ నెలలో నగరంలో కురిసిన వర్షాలకు మూసీ నీరు అత్యంత ప్రమాదకర స్థితిలో ముసారాంబాగ్ వంతెనపై నుంచి ప్రవహించింది. దీంతో అప్పట్లో మంత్రి కేటీఆర్ తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు వంతెనను పరిశీలించారు. పాత బ్రిడ్జి స్థానంలో నూతన వంతెన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అప్పటి వరకు దీనిని మూసి ఉంచి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ ను మళ్లిస్తామని చెప్పారు. అనంతరం పట్టించుకోకపోవడం, వాహనదారులు పడుతున్న ఇబ్బందులు గమనించిన అధికారులు వంతెనపై వాహనాలను తిరిగి అనుమతించారు. ఇదిలా ఉండగా గత రెండు నెలలుగా జీహెచ్ఎంసీ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో మూసీకి వరద పోటెత్తుతోంది. దీంతో వర్షం కురిసిన ప్రతిసారి నీరు వంతెనపై నుంచి ప్రయాణించడంతో ప్రమాదకరంగా మారింది. ఈ వంతెనపై ఎలాంటి ప్రమాదాలు జరుగకముందే ప్రభుత్వం దీనిని మూసి వేసి వీలైనంత త్వరలో బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed