ZOMATO : డెలివరీ బాయ్‌ను వరించిన అదృష్టం

by  |
ZOMATO : డెలివరీ బాయ్‌ను వరించిన అదృష్టం
X

దిశ, ఫీచర్స్ : ఉరుకుల పరుగుల జీవితాలు.. చాలీచాలని జీతాలు.. ఆర్థిక కష్టాలు.. కెరీర్ ప్లానింగ్స్.. ఒక్కటేమిటి కుదురుగా ఉండనీయని ఎన్నో ఆలోచనలు, మరెన్నో బాధ్యతలు సగటు మనిషిని క్షణం తీరికలేకుండా చేస్తుంటాయి. ఇలా రోజంతా తన సొంత సమస్యలతోనే సరిపోతుంటే.. సాటి మనిషికి సాయం చేయడం కల్లే! ఒకవేళ అంత కెపాసిటీ ఉన్నా.. చేయాలన్న మనసు, చేసేంత టైమ్ ఎక్కడిదనే వారూ లేకపోలేదు. అయితే మనుసుంటే మార్గముంటుంది అన్నట్టుగా మహానగరంలో సైకిల్‌పై ఫుడ్ డెలివరీ చేస్తున్న యువకుడి కష్టాలకు చలించిన ఓ వ్యక్తి.. అతనికి బైక్ కొనివ్వడం విశేషం..

మహ్మద్ అకీల్ అనే యువకుడు హైదరాబాద్‌లో జొమాటో సంస్థ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జూన్ 14న కింగ్ కోఠికి చెందిన రాబిన్ ముఖేష్.. రాత్రి 10 గంటలకు లక్టీకాపూల్‌లోని ఒక హోటల్‌ నుంచి టీ ఆర్డర్ చేశాడు. ఈ ఆర్డర్‌‌ను టేకప్ చేసిన అకీల్.. ఆ టైమ్‌కు మెహిదీపట్నంలో ఉండటాన్ని తన ఆర్డర్ ట్రాకింగ్ ద్వారా గుర్తించాడు రాబిన్. ఇక ఆర్డర్ ప్లేస్ అయిన 15 నిమిషాలకు రాబిన్‌కు కాల్ చేసిన డెలివరీ బాయ్.. లొకేషన్‌కు చేరుకున్నాను, కిందకు వచ్చి ఆర్డర్ తీసుకోమని రిక్వెస్ట్ చేశాడు. కాగా కిందకు దిగిన రాబిన్ ఆ యువకుడిని చూసి ఆశ్చర్యపోయాడు. అకీల్ వర్షంలో పూర్తిగా తడిసిపోగా.. తను సైకిల్ మీద రావడాన్ని గమనించి సర్‌ప్రైజ్ అయ్యాడు. 15 నిమిషాల్లోనే ఎలా వచ్చావని ప్రశ్నిస్తే.. ఏడాది నుంచి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నానని, ఇప్పుడు అలవాటైపోయిందని చెప్పడంతో ఆయన ఆలోచనలో పడ్డాడు. వారిద్దరి మధ్య సంభాషణలో అకీల్ బీటెక్ కంప్లీట్ చేశాడని తెలుసుకున్న రాబిన్.. తన ఫొటో తీసుకొని ఫేస్‌బుక్‌లో ఫుడ్ అండ్ ట్రావెల్ పేజీపై అప్‌లోడ్ చేశాడు.

ఆదుకునేందుకు ముందుకొచ్చిన సోషల్ మీడియా..

పాండమిక్ టైమ్‌లో వెదర్ కండిషన్స్ సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న డెలివరీ ఏజెంట్ కమిట్‌మెంట్‌‌ను అప్రిషియేట్ చేసిన నెటిజన్లు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో తనకు ఏవిధంగా సాయపడగలమో తెలుసుకుని మోటార్ బైక్ కొనివ్వాలని డిసైడ్ అయ్యారు. వెంటనే ఫండ్ రైజింగ్‌ మొదలుపెట్టి, 12 గంటల్లోనే రూ. 73,000 మొత్తాన్ని సమకూర్చగలిగారు. ఈ మేరకు టీవీఎస్ ఎక్స్‌ఎల్ బైక్‌తో పాటు ఇతర ఎక్విప్‌మెంట్‌ను గిఫ్ట్‌గా అందజేశారు. ఇక బైక్ కొనుగోలు తర్వాత మిగిలిన రూ. 5 వేలతో అతని కాలేజ్ ఫీజు కోసం చెల్లించారు.

కాగా ఈ ఇనిషియేటివ్‌కు కారణమైన రాబిన్ ముఖేష్.. రెండు సంవత్సరాలుగా పలు ఎన్జీవోలతో కలిసి సోషల్ వర్క్ చేస్తున్నాడు. కేవలం ఒక్క పోస్టుతోనే అకీల్ సాయపడటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాను నెగెటివిటీ స్ర్పెడ్ చేసేందుకు కాకుండా, సరైన విధంగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు.



Next Story