అరటి పండుతో ఇన్ని ప్రయోజనాలా..?

by  |
అరటి పండుతో ఇన్ని ప్రయోజనాలా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అన్ని సీజన్లలో లభించే పండ్లలో అరటి పండు ఒకటి. అంతేకాదు, మనకు చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. ఈ పండ్లను రోజు తినడం ద్వారా చాలా రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అరటి పండులో బరువును తగ్గించడంతో పాటు మలబద్ధకాన్ని నివారించే అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అరటి పండును రోజు తినడం వల్ల దానిలో ఉండే సెరటోనిన్ మెదడు బాగా పని చేసేలా చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరిగేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి.

అరటి పండు ఎముకలకు గట్టిదనాన్నిస్తుంది. దీనిలో అతి తక్కువ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఈ కొవ్వు కాల్షియం లాంటి పదార్ధాలను గ్రహించే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ పండులో ఉండే పీచు పదార్థం, మెగ్నీషియం పుష్కలంగా ఉండడంతో మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రాత్రిపూట అరటిపండు తింటే నిద్ర బాగా పడుతుంది. పెద్దపేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అరటిపండ్ల వల్ల శరీరానికి పొటాషియం బాగా అందుతోంది. దీంతో గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇక దీనిలో సొడియం తక్కువ మోతాదులో ఉండడంతో బీపీ సమస్యలకు చెక్ పెడుతుంది.

రక్తహీనత వల్ల బాధపడే వారు రోజూ ఒక అరటిపండు తింటే మంచిది. దీంతో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. డైటింగ్ చేస్తున్న వారు ఒక పూట భోజనం లేదా టిఫిన్ మానేసి రెండు, మూడు అరటి పండ్లు తింటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. జీర్ణ సంబంధమైన సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.

ప్రతిరోజు అరటి పండు తినడం ద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఈ పండ్లలో ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ఏర్పడటాన్ని అడ్డుకుని ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. ఇక శరీరానికి అవసరమయ్యే మాంగనీసులో 13 శాతం అరటి పండు సమకూరుస్తుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ B6 గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. జీవక్రియలు మెరుగవడానికి, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి, అనవసరమైన రసాయనాలను కిడ్నీలు, కాలేయం నుంచి తొలగించడానికి విటమిన్ B6 తోడ్పడుతుంది. కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఫోలిక్ యాసిడ్ ఉపకరిస్తుంది.


Next Story