పశువుల కొట్టాలే అబార్షన్ కేంద్రాలు..

by  |
పశువుల కొట్టాలే అబార్షన్ కేంద్రాలు..
X

దిశ, మహబూబాబాద్: ఆయన అధికార పార్టీ ఉప సర్పంచ్, ఓ ప్రైవేటు దవాఖానాలో పార్ట్ టైం కాంపౌండర్. కాగా, అక్రమ సంపాదన కోసం భ్రూణ హత్యలు చేసే పనిని ఎంచుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన ఇంటిలోని పశువుల కోట్టాన్నే ఆపరేషన్ థియేటర్‌గా మార్చుకున్నాడు. నిండు గర్భిణులను విచక్షణా రహితంగా అబార్షన్‌లు చేస్తూ భ్రూణ హత్యలకు పాల్పడుతూ ఓ గ్యాంగ్‌ను తయారు చేశారు.

మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి వావివాల గ్రామ శివారు బోటిమీది తండాకు చెందిన ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి వృత్తి రీత్యా ఓ ప్రైవేటు దవాఖాన కాంపౌండర్. ఇతను పని చేసే దవాఖానలో ఓ మహిళ
కాంపౌండర్‌తో పరిచయం చేసుకొని తన ఇంటి పశువుల కొట్టంలో రెండు బెడ్లు వేసి అక్రమ అబార్షన్‌లకు పాల్పడుతున్నారు. వీరికి గ్రామాల వారిగా కొంతమందితో లింక్స్ పెట్టుకొని ఓ ముఠాగా ఏర్పడి అక్రమ సంపాదన కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ ముఠాలో ఎవరికీ కూడా వైద్యానికి సంబంధించిన చదువు తెలియకపోగా, ఎంతో అనుభవం ఉన్న డాక్టర్లుగా వ్యవహరిస్తూ కత్తులు, కత్తెర్లు, సూదులు వాడుతున్నారు.

పశువుల కొట్టంలోనే..

అంతా చీకటి మయం. తండా చివర ఇల్లు. ఇంటి పక్కనే గొర్రెల కొట్టం. వాటి మధ్యలోనే ఓ బెడ్. ఇదే ఆపరేషన్ థియేటర్. ఈ సెట్టింగ్‌లోనే ఆ కాంపౌండర్లు అబార్షన్లు చేస్తున్నారు.

జిల్లాకు కూత వేటు దూరంలో..

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోనే ఈ తండా ఉండడంతో ప్రజలు అవాక్కవుతున్నారు. అధికారులు ఏం చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కారులో తిరుగుతూ..

సమాచారం సేకరించిన ముఠా ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ గ్యాంగ్ ఓ కారులో తిరుగుతూ వారి ఇంటి వద్దే అబార్షన్లు చేస్తూ లక్షల రూపాయలను పోగు చేసుకుంటున్నారు. చట్ట విరుద్ధంగా వ్యవరిస్తూ గర్భం నుండి పిండాన్ని బయటికి తీస్తున్నారు. ఆర్థిక, పోషణ భారంగా భావించిన మహిళలు నెలలు నిండిన పిమ్మట పాప అని నిర్దారించుకున్న తర్వాత ఈ ముఠాను ఆశ్రయిస్తున్నారు.

ఆరుగురిపై కేసు

ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గత కొద్ది రోజుల క్రితం తొర్రూర్ సబ్ డివిజన్ డిప్యూటీ వైద్య శాఖాధికారి కోటాచలం, నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఉప సర్పంచ్ సంతోశ్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

చట్టరీత్యా నేరం

భ్రూణ హత్యలు చేయడం చట్టరీత్యా నేరం. బోటి మీది తండా విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ గౌతమ్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకున్నాం. నిత్యం తమ శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేపడుతున్నాం.

-జిల్లా ఆరోగ్య వైద్యశాఖాధికారి శ్రీరామ్


Next Story

Most Viewed