ఆ విషయంలో గంగూలీ నచ్చడు: నాసిర్ హుస్సేన్

by  |
ఆ విషయంలో గంగూలీ నచ్చడు: నాసిర్ హుస్సేన్
X

దిశ, స్పోర్ట్స్: భారత జట్టును విజయవంతంగా తీర్చిదిద్దడంలో మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాత్ర అమోఘమని, కానీ ఒక విషయంలో మాత్రం అతడంటే తనకు అస్సలు నచ్చదని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. గంగూలీ టాస్‌కు చాలా ఆలస్యంగా వచ్చేవాడు, అంతేకాకుండా తను వ్యాఖ్యాతగా మారిన తర్వాత కూడా కామెంట్రీ బాక్సుకు కూడా లేట్‌గా వచ్చే వాడు. ఆ విషయంలో తనంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదని హుస్సేన్ వెల్లడించాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో పాల్గొన్న హుస్సేన్ అనేక విషయాలు వెల్లడించాడు. ‘గంగూలీ తన సారథ్యంతో భారత్‌ను ఎవరికైనా పోటీనిచ్చే జట్టుగా తీర్చిదిద్దాడు. జట్టులో ఆటగాళ్లంతా నిరాడంబరంగా ఉంటారు. ఉదయం లేవగానే గుడ్‌మార్నింగ్‌ నాసిర్ అని విష్‌ చేసేవాళ్లు. ఆ అనుభవం ఎంతో బాగుంటుంది. ఇక గంగూలీ సారథ్యంలోని టీమిండియాతో ఆడటం యుద్ధాన్ని తలపించేది. క్రికెట్‌ పట్ల భారత అభిమానులకున్న ఇష్టాన్ని అతను అర్థం చేసుకున్నాడు. వాళ్లకది క్రికెట్‌ మాత్రమే కాదు. అంతకుమించి ఎంతో ముఖ్యమైనది’ అని నాసిర్ హుస్సేన్ చెప్పుకొచ్చాడు. నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్స్‌లో భారత జట్టు ఘన విజయం సాధించినప్పుడు గంగూలీ జెర్సీ విప్పి లార్డ్స్ బాల్కనీలో సంబరాలు చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో నాసిర్ హుస్సేన్ 128 బంతుల్లో 115 పరుగులు చేశాడు. భారత జట్టు 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.



Next Story