ట్యాంక్ ​బండ్​లోనే గణేష్ నిమజ్జనం… ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ సవాల్

by  |
ట్యాంక్ ​బండ్​లోనే గణేష్ నిమజ్జనం… ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ సవాల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వినాయక నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదని కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలో చెప్పాలని డిమాండ్​ చేశారు. గాంధీభవన్​లో బుధవారం మీడియాతో మాట్లాడారు. వినాయక విగ్రహాలను ఈసారి ట్యాంక్ ​బండ్​లోనే నిమజ్జనం చేస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని సవాల్​ విసిరారు. ఇలాంటి అంశాలపై కోర్టుకంటే ముందుగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించకుండా రివ్యూ పిటిషన్​ వేస్తామనడం సరికాదన్నారు.

ప్రభుత్వానికి ముందు చూపు లేదన్నారు. ప్రజల అయోమయానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే విషయంలో రాజకీయ పార్టీలను సంప్రదించకపోవడం సరికాదన్నారు. మరోవైపు రాష్ట్రంలో అమానుష సంఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం కండ్లు మూసుకుందని, సైదాబాద్​ ఘటనపై మంత్రులు, అధికారులు తలోరకంగా మాట్లాడుతున్నారని వీహెచ్​ తప్పుపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్భయ, దిశ ఇలా ఒక్కొక్క సంఘటన జరుగుతూనే ఉందని, పోలీసులు హజీపూర్​ ఘటనలో బాగా పనిచేశారన్నారు. కానీ న్యాయస్థానాల్లో శిక్ష అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారం చేస్తే ఉరితీసే చట్టం మన దేశంలో అమలు చేస్తేనే భయం ఉంటుందని హనుమంతరావు సూచించారు.

Next Story

Most Viewed