నిరుద్యోగులే టార్గెట్.. రీఫండ్ పేరిట మోసం చేస్తున్న కేటుగాళ్లు

by  |
నిరుద్యోగులే టార్గెట్.. రీఫండ్ పేరిట మోసం చేస్తున్న కేటుగాళ్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులే టార్గెట్‌గా కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇచ్చినకాడికి లాగేసుకొని ముఖం చాటేస్తున్నారు. అంతేకాకుండా, ఏదైనా ఉద్యోగం కోసం అప్లై చేసి రెస్యూమ్‌ను(resume) అప్లోడ్ చేసినవారు, రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని గుర్తించి వారిని వలలో వేసుకునే పనిలో కేటుగాళ్లు ఉన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజును తిరిగి చెల్లిస్తామని చెప్పి జేబులు ఖాళీ చేస్తున్నారు. ఇదే తరహాలో హైదరాబాద్ కి చెందిన ఓ ఫార్మ ఉద్యోగి దగ్గర ఏకంగా రూ.15 లక్షల వరకూ వసూలు చేశారు. దీంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను సంప్రదించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు వెబ్‌సైట్లలో తమ వివరాలను నమోదు చేసి, కొంత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తుంటారు. అయితే, దానికి సంబంధించిన ఛార్జీలన్నీ చెల్లించినప్పటికీ స్పందన రాకపోవడంతో వాటిని మర్చిపోతున్నారు. అయితే, ఇలాంటి వారి సమాచారాన్ని సేకరించిన కేటుగాళ్లు, వారికి ఫోన్లు చేసి ఉద్యోగాలిపిస్తామని లేదంటే ఆ డబ్బును తిరిగి చెల్లిస్తామని నమ్మిస్తున్నారు. [email protected] అనే ఐడీ నుంచి మెయిల్స్‌ పంపిస్తున్నారు. అయితే, తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు గతంలో ఓ వెబ్‌సైట్ కి రూ.1.8 లక్షలు చెల్లించగా.. వాటిని వడ్డీతో కలిపి రూ.1.98 లక్షలు రిఫండ్‌ చేస్తామని చెప్పి ముంచేశారు. మొదటగా బ్యాంకు అకౌంట్ వివరాలు అడిగి.. సర్వర్ ప్రాబ్లమ్ అని చెబుతారు. తర్వాత కొద్ది సేపటికి మీ అకౌంట్ రెడ్ మార్క్ చూపిస్తుందని, డబ్బులు పంపాలంటే మా అకౌంట్లో ఐదింతల డబ్బు ఉండాలని చెబుతారు. అది నమ్మి బాధితుడి నుంచి డబ్బు వసూలు చేసి సర్వర్ ప్రాబ్లమ్ అని చెప్పి మోసం చేస్తున్నారు. అయితే, దీనిపై సైబర్ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు.


Next Story

Most Viewed