నిరుపేద బిడ్డ‌ను డాక్ట‌ర్ చేసిన గుత్తా..

by  |
నిరుపేద బిడ్డ‌ను డాక్ట‌ర్ చేసిన గుత్తా..
X

దిశ, న‌ల్ల‌గొండ‌: రెక్కాడితే గాని డొక్కాడ‌ని క‌డు బీద‌రకంలో పుట్టిన ఆ దళిత బిడ్డ చదువుల తల్లి. నల్లగొండ పట్టణానికి చెందిన దివ్యశ్రీ. ఇంటర్ వరకు తల్లిదండ్రుల రెక్కల కష్టంపై ఆధారపడి చదివింది. అయితే, సరస్వతీ అనుగ్రహం ఉన్న ఆమెకు లక్ష్మీ దేవత కటాక్షం కరువైంది. డాక్ట‌ర్ కావాల‌న్న ఆమె సంక‌ల్ప సిద్ధి, ప‌ట్టుద‌లను చూసి ఆమె స్నేహితులు, తెలిసిన వారి ప్రోత్సాహంతో ఎంసెట్ రాసింది. ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఎంబీబీఎస్ చ‌దువు పూర్తి చేయ‌డానికి ఐదేండ్లు ప‌డుతుంది. ఏడాదికి అన్నింటికి క‌లిపి రూ.1.20ల‌క్ష‌లు ఖ‌ర్చుపెడితే తప్ప చ‌దువ‌లేని ప‌రిస్థితి. తాము చదివించలేమనీ చదువు మానేయాలని తల్లిదండ్రులు అన్నారు. కాని, అప్పటి పార్లమెంటు సభ్యులు, నేడు శాసనమండలి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఆర్థిక సహాయంతో ఆమె ఇప్పుడు డాక్టర్ అయింది.

త‌న ఆర్థిక స్తోమ‌త గురించి చెప్పి చ‌దువుకోవ‌డానికి సాయం కావాల‌ని దివ్యశ్రీ సుఖేందర్ రెడ్డిని కలిసింది. స‌ర‌స్వ‌తి ఆశీర్వ‌దించిన దివ్య‌శ్రీ డాక్ట‌ర్ అవ్వ‌డానికి అయ్యే ఖ‌ర్చును తాను భ‌రిస్తాన‌ని సుఖేంద‌ర్‌రెడ్డి ముందుకొచ్చారు. ఐదేండ్ల పాటు ఎంబీబీఎస్‌కు అయ్యే ఖ‌ర్చు ఇస్తాన‌ని దివ్య‌శ్రీ‌కి భ‌రోసా ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం దివ్య చదువుకు కోసం రూ. 6.37 లక్షల‌ ఆర్థిక సహాయాన్ని అందించారు. దేవుడిలాగా తనకు సహాయాన్ని అందించి డాక్టర్ కావడానికి సహకారం అందించిన శాసన మండలి చైర్మన్ సుఖేంద‌ర్‌రెడ్డిని సోమ‌వారం నల్గొండలోని ఆయన నివాసంలో దివ్య శ్రీ ఆమె తల్లి యాదమ్మ కలిసి ధన్యవాదాలు తెలిపారు.

తను చదువుకోవడానికి అన్ని తానై ఆదుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ,అన్ని దానాల కన్న విద్య దానం గొప్పదని తన తల్లి గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అన్నారు. తన రాజకీయ జీవితంలో పొందిన ప్రశంస‌ల కన్న దివ్య కండ్లలో కనిపించిన ఆనందం చాలా సంతోషాన్ని కలిగించింది అని చెప్పారు. ప్రతిభ ఉంటే ఏదైనా సాధించగలం అని దివ్య నిరూపించింది అని ఆమెను అభినందించారు.

Tags: gutta sukender reddy, council chairman, helped, poor girl

Next Story