కేసీఆర్‌ను రైతు హంతకుడు అనడం సరికాదు : గుత్తా సుఖేందర్

by  |
కేసీఆర్‌ను రైతు హంతకుడు అనడం సరికాదు : గుత్తా సుఖేందర్
X

దిశ, నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులకు ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వామేనని శాసనమండలి మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రైతుల మనోవేదన సీఎం కేసీఆర్‌కు తెలుసు అంటూ గుత్తా కామెంట్స్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రబీ ధాన్యం ఇంకా 50 శాతం ఎఫ్‌సీఐ గోదాముల్లోనే ఉందని, కేంద్ర ప్రభుత్వం రైల్వే వ్యాగన్లను ఏర్పాటు చేసి వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని, పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.

అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరికీ గౌరవ వేతనాన్ని సీఎం కేసీఆర్ భారీగా పెంచారని చెప్పారు. బీజేపీ నాయకులు కేసీఆర్‌ను రైతు హంతకుడని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేసి 750 మంది అన్నదాతల చావుకు కారకులెవరో దేశ ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలన్నారు. ఈ నెల 10వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఎంసీ కోటిరెడ్డిని గెలిపించాలని ఆయన స్థానిక సంస్థల ప్రతినిధులను కోరారు. రైతుల సంక్షేమం విషయంలో దేశంలోనే సీఎం కేసీఆర్ మార్గదర్శకంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed