DDC ఎన్నికల్లో ‘గుప్కార్ అలయన్స్’ విజయం

by  |
DDC ఎన్నికల్లో ‘గుప్కార్ అలయన్స్’ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో జరిగిన డిస్ట్రిక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (డీడీసీ) ఎన్నికల్లో మాజీ సీఎం ఫారూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుఫ్కార్ అలయెన్స్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 20 డీడీసీలకు గాను కాంగ్రెస్‌ పార్టీతో కలసి గుఫ్కార్ కూటమి 13 జిల్లాల్లో సొంతం చేసుకుంది. జమ్ము ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో బీజేపీ గెలుపొందింది. ఆర్టికల్స్ 370, 35ఏ రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయిన జమ్ముకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిన విషయం విధితమే. ఆ తర్వాత మొదటిసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. జిల్లాకు 14 చొప్పున 20 జిల్లాల్లో 280 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రత్యర్థి పార్టీలైన ఫారూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ ఆధ్వర్యంలోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)లు మరో ఐదు స్థానిక పార్టీలతో కలసి పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుఫ్కార్ డిక్లరేషన్ పేరిట కూటమి కట్టి పోటీ చేశాయి. ఈ కూటమి 100కుపైగా స్థానాల్లో విజయం సాధించింది. 74 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 26 స్థానాల్లో విజయం సాధించింది. 49 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 72 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ మూడు చోట్ల విజయం సాధించింది. 10 డీడీసీలకు గాను కూటమి 9 కైవసం చేసుకున్నది. శ్రీనగర్‌ జిల్లాలో స్వతంత్రులు విజయం సాధించారు. జమ్ములో బీజేపీ 71 స్థానాల్లో విజయం సాధించి జమ్ము, ఉద్ధంపూర్, సాంబ, కథువా, రియసి, దొడ జిల్లాలను కైవసం చేసుకుంది. 45 స్థానాలను సొంతం చేసుకున్న నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు పూంచ్, రాజౌరి, కిస్తావర్, రాంబన్ జిల్లాలను తన ఖాతాలో వేసుకున్నది. గత ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370ను రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డీడీసీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని మాజీ సీఎంలు ఓమర్ అబ్దుల్లా, మెహబూబా ముప్తీలు పేర్కొన్నారు.

కమలం వికసించింది : బీజేపీ

కశ్మీర్‌ లోయలో కమలం వికసించిందని బీజేపీ పేర్కొంది. లోయలో మొదటిసారి బీజేపీ ఖాతా తెరిచింది. ‘బీజేపీకి 4.5లక్షల ఓట్లు వచ్చాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్‌లకు కలపి కూడా ఇన్ని ఓట్లు రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులకు జమ్ముకశ్మీర్ ఓటర్లు చెంప పెట్టు లాంటి సమాధానం ఇచ్చారని కేంద్ర రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.

Next Story