కోమటిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి వార్నింగ్

by  |
కోమటిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి వార్నింగ్
X

దిశ, మునుగోడు: నియోజకవర్గంలోని చిన్న నీటిపారుదల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చండూరు, మునుగోడు మండలాల నూతన ఆహారభద్రత కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని ఫీడర్ చానల్, మేళ్లచెరువు, శేషరాజు కుంటలతో పాటు మరిన్ని చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని అన్నారు. అదేవిధంగా మునుగోడులో అవసరమైనచోట చెక్ డ్యామ్‌ల నిర్మాణాన్ని కూడా చేపడతామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర ప్రభుత్వ సర్వే సంస్థలు తెలిపాయని గుర్తు చేశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వార్నింగ్..

త్వరలో నియోజకవర్గంలోని రైతు వేదికల ప్రారంభోత్సవానికి స్వయంగా వస్తానని, అభివృద్ధికి అడ్డు తగిలే వారికి తగిన గుణపాఠం చెబుతామని కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్ నారబోయిన స్వరూపరాణి, చండూరు జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, మునుగోడు ఎంపీపీ కర్నాటి స్వామి, చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రం మాధవి, అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Next Story