ఆ ఇబ్బందులు తాళలేక గెస్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నం..

by  |
ఆ ఇబ్బందులు తాళలేక గెస్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నం..
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కొండనాగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కామర్స్ గెస్ట్ లెక్చరర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయక్ శుక్రవారం అచ్చంపేట పట్టణంలో అద్దె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే తేరుకుని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్ కు పంపించాలని సూచన చేశారని బంధువులు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా..

గత 18 నెలలుగా గెస్ట్ ఫ్యాకల్టీ గా పని చేసిన లెక్చరర్లకు వేతనం సకాలంలో అందలేదని, గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయడం లేదని, కుటుంబ పోషణ భారంగా మారిందని తరుచూ భార్యతో గొడవ పడుతున్న శీను నాయక్ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో తన ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని, అక్కడ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలాంటి గెస్ట్ ఫ్యాకల్టీ, నిరుద్యోగులు బ్రతకడం చాలా కష్టమని భావించి చనిపోవడమే నా సమస్యకు పరిష్కారం అని భావించి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత జూనియర్ కాలేజీలు బంద్ చేయడం జరిగింది. తదుపరి కుటుంబ భారం ఇబ్బందికరంగా మారడంతో కుటుంబ పోషణ కోసం శ్రీను నాయక్ కూలీ, నాలీ చేసుకుంటూ బ్రతుకుతూ బండిని లాగుతున్నాడు. తన చదువుకు తగ్గ ఉద్యోగం ఎవరు ఇవ్వకపోవడంతో చివరికి కట్టెలు కొట్టడానికి కూడా వెనుకాడని శ్రీను నాయక్ సరైన సంపాదన లేకపోవడంతో బతుకు భారమైందని భావించి, ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు.

ఆత్మహత్యల తెలంగాణ గా మారింది..

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణగా మారిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యుడు డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. శుక్రవారం అచ్చంపేట మండలం ఐనోల్ గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పునుంతల మండలం దేవ దారి కుంట గ్రామానికి చెందిన శ్రీను నాయక్ గెస్ట్ లెక్చరర్ గా కొండనాగుల కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారని, గత 18 నెలలుగా జీతాలు అందక ఇబ్బంది పడుతూ చివరికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారంటే, ముమ్మాటికీ ప్రభుత్వ పాలన దుర్మార్గంగా మారిందని ఆయన విమర్శించారు. తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని భావించిన నిరుద్యోగులు అందరూ నేడు ఆత్మహత్య పాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. శనివారం ఉదయం 10 గంటలకు అచ్చంపేట పట్టణంలో జరిగిన సంఘటనకు నిరసనగా రాస్తారోకో పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed