వరంగల్ లో జోరుగా బెల్లం దందా!

by  |
వరంగల్ లో జోరుగా బెల్లం దందా!
X

దిశ, వరంగల్: కరోనా ప్రభావంతో తాత్కాలికంగా మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో బెల్లం మాఫియా జడలు విప్పింది. మందు బాబుల బలహీనతను ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు పెద్ద మొత్తంలో బెల్లం, స్పటికను డంప్ చేస్తున్నారు. వీలును బట్టి అధికారుల కళ్లుగప్పి తండాలకు రవాణా చేస్తూ గుడుంబా తయారీని ప్రోత్సహిస్తున్నారు. మద్యం బ్లాక్ లో లభిస్తున్నప్పటికీ ధరలు మండిపోతుండటంతో మందు బాబులు చవకగా దొరికే గుడుంబా వైపు చూస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుత డిమాండ్ ను బట్టి బెల్లం వ్యాపారులు, గుడుంబా తయారీ దారులు కుమ్మక్కై అక్రమదందాను కొనసాగిస్తున్నారు. వీరిని కట్టడి చేయాల్సిన ఎక్సైజ్ అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా పల్లెల్లో గుడుంబా ఏరులై పారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆంధ్రా నుంచి రవాణా..?

కరోనా కారణంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా భావించే మద్యం షాపులు బంద్ అయ్యాయి. దీంతో మద్యం ప్రియులు నలభై రోజులుగా మందు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇదే అదునుగా భావించిన లిక్కర్ వ్యాపారులు నిబంధనలు పక్కన బెట్టి వైన్స్ లు తెరిచి మద్యం డంప్ చేసుకుని ఇష్టమొచ్చిన రీతిలో ధరలు నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నారు. అక్కడక్కడ మద్యం పట్టుబడుతున్నప్పటికీ పూర్తి స్ధాయిలో కట్టడి చేయడంలో ఎక్సైజ్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లం మాఫియా పల్లెలు, కుగ్రామాలు, తండాల్లో గుడుంబా తయారీకి తెరతీసింది. చిత్తూరు, అనకాపల్లి నుంచి లారీలు, డీసీఎంలలో బెల్లం, స్పటికను దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు తయారీ దారులకు విక్రయిస్తున్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో రూ. 18 లక్షల విలువ గల బెల్లం, స్పటికను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. అదే విధంగా వరంగల్ రూరల్ జిల్లాలో సైతం బెల్లం పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకంతా కూడా నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నెక్కొండకు చెందిన బెల్లం వ్యాపారిదిగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. కానీ, అతడిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

దోపిడీ దందా..?

మందు బాబుల బలహీనతను బెల్లం వ్యాపారులు, గుడుంబా తయారీ దారులు క్యాష్ చేసుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో కాటన్ (20 కిలోలు) బెల్లం ధర రూ. 900 ఉండగా రూ. 1800 కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోన్నది. అదే విధంగా లీటర్ సారా రూ. 100 ఉండగా రూ. 500 వరకు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు సమాచారం. కొద్దిరోజులుగా ఎక్సైజ్, పోలీస్ అధికారులు తండాల్లో వరుస దాడులు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో బెల్లం, గుడుంబా నిల్వలను స్వాధీనం చేసుకుంటున్నారు. నిందితులపై కేసులు సైతం నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ బెల్లం అక్రమ రవాణా, గుడుంబా తయారీ మాత్రం ఆగడం లేదనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారుల సహకారంతోనే బెల్లం వ్యాపారులు తమ దందాను నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags: black jaggery, gudumba, manufacturers, excise officer, police, Andhra Pradesh


Next Story

Most Viewed