మరోసారి రికార్డు క్రియేట్ చేసిన జీఎస్టీ వసూళ్లు

by  |
మరోసారి రికార్డు క్రియేట్ చేసిన జీఎస్టీ వసూళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్‌లో నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును తాకాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు వరుస నెలల్లో రూ. లక్ష కోట్లకు పైగా నమోదవుతున్నాయి. తాజాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో కూడా జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అది కూడా జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో వసూలవడం ఇది రెండోసారి అని ఆర్థిక శాఖ వెల్లడించింది. సమీక్షించిన నెలలో మొత్తం జీఎస్టీ ఆదాయం రూ. 1,30,127 కోట్లుగా ఉంది.

గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఇది 24 శాతం కాగా, కరోనాకు ముందు నాటి 2019, అక్టోబర్ కంటే 36 శాతం అధికమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘జీఎస్టీ విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి అక్టోబర్‌లో రెండో అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. ఆర్థిక పునరుద్ధరణతో పాటు, కొవిడ్-19 మహమ్మారి సెకెండ్ వేవ్ ప్రభావం నుంచి బయటపడి పెరుగుతున్న ఈ-పే బిల్లుల ధోరణికి అద్దం పడుతుందని’ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రికార్డు వసూళ్లతో వరుసగా నాలుగో నెలా జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్ల మార్కును అధిగమించాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో రూ. 1.17 లక్షల కోట్లు నమోదయ్యాయి. మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ వసూళ్లు రూ. 23,861 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 30,421 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ. 67,361 కోట్లు వచ్చాయి. సెస్ రూపంలో మొత్తం రూ. 8,484 కోట్లు వచ్చినట్టు ప్రభుత్వం వివరించింది.

తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్ల వృద్ధి..

అక్టోబర్‌లో జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ రూ. 3,383 కోట్లతో 14 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే నెలలో రూ. 3,854 కోట్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రూ. 2, 480 కోట్లతో 16 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. 2020, అక్టోబర్‌లో రూ. 2,879 కోట్లు వసూలయ్యాయి.


Next Story

Most Viewed