ఐదు నెలల గరిష్ఠానికి జీఎస్టీ ఆదాయం

by  |
GST collections
X

దిశ, వెబ్‌డెస్క్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌లో ఐదు నెలల గరిష్ఠాలకు చేరుకున్నాయి. కొవిడ్-19 మహమ్మారి సెకెండ్ వేవ్ ప్రభావం నుంచి ఆర్థికవ్యవస్థ బయటపడి కార్యకలాపాలు పుంజుకోవడంతో వరుసగా మూడో నెలా రూ. 1.1 లక్షల కోట్ల మార్క్ దాటినట్టు శుక్రవారం ఆర్థిక శాఖ వెల్లడించింది. సమీక్షించిన నెలలో మొత్తం రూ. 1,17,010 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 23 శాతం అధికమని ఆర్థిక శాఖ గణాంకాలు తెలిపాయి. 2020లో ఇదే నెలలో రూ.95,480 కోట్లు వసూలయ్యాయి. మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ రూ. 20,578 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 26,767 కోట్లు, ఐజీఎస్టీ రూ. 60,911 కోట్లుగా ఉన్నాయి. సెస్ రూపంలో రూ. 8.754 కోట్లు వచ్చాయని ఆర్థిక శాఖ పేర్కొంది. ‘ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకోవడాన్ని జీఎస్టీ వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఆదాయంలో సానుకూల ధోరణి ఇలాగే కొనసాగనుంది. ప్రస్తుత ఏడాది ద్వితీయార్థంలో అధిక ఆదాయం నమోదయ్యే అవకాశాలున్నాయని’ ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్థిక వృద్ధితో పాటు పన్ను ఎగవేతలను అరికట్టడం, ప్రధానంగా నకిలీ బిల్లర్‌లపై చర్యల కారణంగా సెప్టెంబర్ జీఎస్టీ ఆదాయం పెరిగేందుకు దోహదం చేసినట్టు పేర్కొంది. సెప్టెంబర్ నెలలో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 30 శాతం ఎక్కువగా ఉన్నాయి. అలాగే, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం(సేవల దిగుమతితో సహా) గతేడాది కంటే 20 శాతం అధికంగా ఉంది.


Next Story

Most Viewed