టీఆర్ఎస్‌లో పెరుగుతున్న పోటీ… హుజురాబాద్ ముఖచిత్రం

by  |
టీఆర్ఎస్‌లో పెరుగుతున్న పోటీ… హుజురాబాద్ ముఖచిత్రం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హుజురాబాద్‌లో నుండి పోటీ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నవారు తమ వంతు ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఈటల రాజేందర్ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన తరువాత టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్‌లో పట్టు బిగించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు వస్తే తమకే అవకాశం వస్తుందన్న ఆశతో నాయకులు పావులు కదుపుతున్నారు. సందట్లో సడేమియాలా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు కొంతమంది నాయకులు.

పోటీ తీవ్రం…

ఉప ఎన్నికలు అనివార్యం అయితే హుజురాబాద్ నుండి పోటీ చేసే వారి జాబితాలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నియోజకవర్గానికి చెందిన కేడర్‌తో ఆయనకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉండడం కూడా లాభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈటల బ్రాండ్ కు చెక్ పెట్టేందుకు వినోద్ కుమార్ బరిలో నిలిస్తే ఫలితాలు సానుకూలంగా ఉంటాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు పౌరసత్వం రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేములవాడలో కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడ జరిగే ఉప ఎన్నికల్లో బోయినపల్లి వినోద్ కుమార్ బరిలో నిలుస్తారని ప్రచారం జరిగింది.

కానీ ఆయన తాను పోటీ చేసే ఆలోచనలో లేనని, తప్పుడు ప్రచారం మానుకోవాలని వేములవాడలో ప్రకటించారు. దీంతో వినోద్ కుమార్ హుజురాబాద్ నుండి పోటీ చేసేందుకు ఉత్సుకత చూపుతారా అన్నదే ఇప్పుడు అంతుచిక్కకుండా తయారైంది. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఆయన సతీమణి సరోజనమ్మను బరిలో నిలిపే అవకాశాలు కూడా లేకపోలేదని భావిస్తున్నారు. మరోవైపున బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ కూడా ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్నారు. గతంలో హుజురాబాద్ నుండి రెండు సార్లు ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా పోటీచేసిన తనకు నియోజకవర్గంలో వ్యక్తిగత పరిచయాలు కూడా ఉన్నాయని అంటున్నారు కృష్ణమోహన్.

అధికార పార్టీ బలానికి తోడు తనకు టికెట్ ఇస్తే బీసీ స్థానాన్ని భర్తీ చేసినట్టవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడ తనవంతు ప్రయత్నాలు ప్రారంబించారు. చాలాకాలంగా ఈటలతో పొసగగకుండా ఉన్న గెల్లు వ్యతిరేక వర్గంగానే ఉండిపోయారు. ఆయన తండ్రిపై కూడా కేసులు నమోదు చేయించడంతో తమ కుంటుంబం ఇబ్బందుల పాలైందని శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. తనకు ఈ సారి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. మరో వైపున స్థానికంగా ఉండని కొంతమంది కొత్తవారు కూడా రంగంలోకి దిగి మంత్రుల ఆశీస్సులతో బరిలో నిలావాలని ఆశిస్తున్నారు. దీంతో హుజురాబాద్ నుండి పోటీ చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని స్పష్టం అవుతోంది.

అంతా అధిష్టానం చేతుల్లోనే…

అభ్యర్థిత్వం ఖరారు అయితే చాలు తమను గెలిపించుకునే బాధ్యత అంతా అధిష్టానంపైనే ఉంటుందన్న ఆశతో టీఆర్ఎస్ నుండి టికెట్ ఆశిస్తున్న వారూ లేకపోలేదు. ఉప ఎన్నికల్లో బరిలో నిలిస్తే సొంత ఖర్చు లేకుండానే చట్ట సభలోకి అడుగుపెడతామన్న ఆలోచనతో స్థానికంగా అంతగా పట్టు లేకున్నప్పటికీ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వస్తే మాత్రం టీఆర్ఎస్ ఎవరి పేరు ఫైనల్ చేస్తుందోనన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తోంది.



Next Story

Most Viewed