వరంగల్, ఏనుమాముల మార్కెట్లో గ్రూపు రాజకీయాలు!

by  |
వరంగల్, ఏనుమాముల మార్కెట్లో గ్రూపు రాజకీయాలు!
X

దిశ, వరంగల్: వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో ఇప్పుడు గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. కొంతకాలంగా మార్కెట్ చైర్మన్, సెక్రటరీ మధ్య నడుస్తోన్న కోల్డ్ వార్ మార్కెట్ పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నట్లు తెలుస్తోన్నది. దీంతో మార్కెట్ లో పెత్తనం చెలాయించేందుకు ఇరువురు పోటీ పడుతూ పాలనను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాలకమండలి, ఉద్యోగుల నడుమ సయోధ్య కరువై రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పంపకాల కోసమేనా పంచాయితీ..?

వరంగల్ అర్భన్ జిల్లా కేంద్రంలోని ఏనుమాముల మార్కెట్ ప్రఖ్యాతి గాంచింది. ఆయా సీజన్లను బట్టి ఇక్కడికి పలు జిల్లాల నుంచి రైతులు పత్తి, మిర్చీ, మొక్కజొన్న, వరి, వేరుశెనగ, కందులు, ఇతర ధాన్యాలు భారీ ఎత్తున విక్రయించేందుకు తీసుకువస్తారు. ప్రతి ఏడాది కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తది. ఈ నేపథ్యంలో మార్కెట్ చైర్మన్, సెక్రటరీ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, కమీషన్లకు అలవాటు పడిన పాలక వర్గం, అధికారుల వైఖరి వెరసి ఇరువర్గాల మధ్య ఆదిపత్య పోరుకు బీజం వేసింది. దీంతో అప్పడప్పుడు ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోన్నది. కొద్ది రోజుల కిందట మార్కెట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చైర్మన్ ఆగ్రహంతో ఊగిపోతూ సెక్రటరీపై దాడికి యత్నించాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉద్యోగులు మరుసటి రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించారు. దీంతో చైర్మన్, సెక్రటరీకి బహిరంగ క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కానీ, చైర్మన్, సెక్రటరీ మధ్య అంతర్యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉందని ప్రచారంలో ఉంది. ఇటీవల సమావేశమైన పాలకమండలి, సెక్రటరీని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని లేదా మరో చోటికి బదిలీ చేయాలని తీర్మాణం చేసింది. ఈ పరిణామం మార్కెట్లో మరింత దుమారం రేపింది. అసలు వీరి మధ్య వైరానికి అసలు కారణం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమైన నేపథ్యంలో పంపకాల కోసమేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లో పత్తి, మిర్చీ, ధాన్యం కొనుగోళ్లలో కమీషన్ వసూలు చేసి ఇవ్వాలనే చైర్మన్ ఆదేశాలను సెక్రటరీ తిరస్కరించినందున ఈ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోన్నది.

చైర్మన్ డబుల్ గేమ్…

మార్కెట్లో కార్యకలాపాలను గాడిలో పెట్టాల్సిన చైర్మన్ వైఖరి కారణంగా పాలన భ్రష్టు పట్టిందనే విమర్శలున్నాయి. పైకి ఒకటి చెబుతూ మరోలా వ్యవహరిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అయినప్పటికీ ఇటు పాలకమండలి, ఉద్యోగుల్లో మంచి పేరు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో ఏవో మాయమాటలు చెబుతూ పలు సమస్యలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నట్లు తెలుస్తోన్నది. మార్కెట్ లావాదేవీల్లో కమీషన్లు దండుకుంటూనే తనకేం తెలియదని అంతా సెక్రటరీచే కాజేస్తున్నాడని పాలకమండలి సభ్యులను నమ్మిస్తూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెక్రటరీ ఏ సమస్య వచ్చినా చైర్మన్ వద్దకు వెళ్లాలంటూ తమ వద్దకు వచ్చే రైతులు, ఉద్యోగులు, సిబ్బందికి ఉచిత సలహాలు ఇస్తూ ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోన్నది.

Tags: enumaamula market, farmers, chairmen, secretary

Next Story

Most Viewed