TRSలో వర్గపోరు.. ఎన్నికలే లక్ష్యంగా ఆ ముగ్గురి గ్రూపు రాజకీయం

by  |
trs 1
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఆ మూడింటా సరికొత్త రాజకీయ ఆట మొదలైంది. అవి మూడు గిరిజన రిజర్వు అసెంబ్లీ స్థానాలు.. మాజీ ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ పంచాయతీ రాజుకుంటోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయం జోరందుకుంటోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఎవరికి వారు తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

తమ గ్రూపును బలోపేతం చేసుకోవడం మీద దృష్టి సారించారు. బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేచింది. ఆధిపత్యం కోసం మాజీలు సరికొత్త ఎత్తుగడలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మూడు ఎస్టీ, రెండు ఎస్సీ రిజర్వుకాగా.. మిగతా ఐదు జనరల్ స్థానాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్.. మూడు అసెంబ్లీ స్థానాలు ఎస్టీ రిజర్వుగా ఉన్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్, ఖానాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులు రాథోడ్ బాపురావు, అజ్మీరా రేఖానాయక్, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిచారు. తర్వాత సక్కు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా మూడు చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుండగా.. ఇక్కడ సరికొత్త రాజకీయ సమీకరణాలు నెలకొన్నాయి. ఈ మూడు చోట్ల అధికార పార్టీలోనే తాజా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత జడ్పీ చైర్మన్లు అసెంబ్లీ టికెట్ కోసం తమ ప్రయత్నాలు చేస్తుండటంతో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి.

బోథ్ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోడం నగేశ్.. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందగా.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. బోథ్ సెగ్మెంట్ నుంచి 2014లో రాథోడ్ బాపురావు(టీఆర్ఎస్) పోటీ చేసి గెలుపొందగా.. 2018లో కూడా విజయం సాధించారు.

ఆసిఫాబాద్ నియోజకవర్గం నార్నూర్ మండలానికి చెందిన బోథ్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే.. మాజీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వర్గాలుగా విడిపోవడంతో టీఆర్ఎస్ పార్టీ చీలిపోయింది. తాజాగా మాజీ ఎంపీ గోడం నగేశ్ కూడా బోథ్ స్థానంపై దృష్టి పెట్టడంతో.. రాథోడ్ బాపురావుతో మరింత దూరం పెరిగింది. ఎవరికి వారు తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. 2014లో టీఆర్ఎస్ నుంచి కోవ లక్ష్మీ గెలువగా.. 2018లో ఓడిపోయారు. కోవ లక్ష్మీపై విజయం సాధించిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఆయన మరో వర్గంగా ఉన్నారు. కోవ లక్ష్మీ ప్రస్తుతం కొమురం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉండటంతో.. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు వస్తున్నా.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీటు కోసం ఎవరికి వారు తమ పట్టు, ఆధిపత్యం సాధించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఖానాపూర్ నియోజకవర్గంలో 2014, 2018లో టీఆర్ఎస్ నుంచి అజ్మీరా రేఖానాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు సొంత పార్టీలోనే సెగ మొదలైంది. ఆదిలాబాద్ జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న రాథోడ్ జనార్ధన్ కూడా ఖానాపూర్ నియోజక వర్గంపై దృష్టి పెట్టారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం నార్నూర్ మండలానికి చెందిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ టికెట్ కోసం ఇప్పటి నుంచే ఎత్తుగడలు వేస్తున్నారు.

ఉట్నూర్ కేంద్రంగా ఉంటున్న ఆయన.. ఎమ్మెల్యే అసంతృప్తులను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరగగా.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.


Next Story

Most Viewed