టీఆర్ఎస్‌కు మరో భారీ షాక్.. కరీంనగర్‌లో మళ్లీ..

by  |
TRS-Group-Politics1
X

దిశ, గోదావరిఖని: సింగ‌రేణిలో టీఆర్ఎస్ అనుబంధ సంఘ‌మైన తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం గ్రూపుల‌తో స‌త‌మ‌తం అవుతోంది. యూనియ‌న్ ప్రారంభం అయినప్పటి నుండి ఇదే ప‌రిస్థితి సింగరేణిలో కొనసాగుతుంది. ఇప్పుడు ప‌రిస్థితి మ‌రింత దారుణంగా త‌యార‌య్యింది. పెద్ద నేత‌లు బ‌య‌ట ప‌డ‌కుండా యూనియ‌న్‌లో త‌మ ప‌ట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంటే ఏరియా వారీగా ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం గ్రూపుల్‌గా విడిపోయి తమ అనుచర నాయకులతో సమావేశాలు నిర్వహించుకుంటూ తమ నాయకుడి మెప్పు పొందేందుకు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో మూడు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారని సింగరేణి వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు ఒకే వర్గానికి చెందిన నాయకులు అందరికీ పదవులు ఇచ్చి మిగతా ఇద్దరికి సంబంధించిన నాయకులకు ఎటువంటి పదవులు ఇవ్వడం లేదని తమను చిన్నచూపు చూస్తున్నారనే చర్చ కార్మికుల్లో సాగుతుంది. ఇప్పటికే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు (సీఎల్ సీ) సెంట్రల్ లేబర్ కమిషనర్ తో పాటు సౌత్ జోన్ నుండి సింగరేణి సీఎండీ శ్రీధర్ కు ఎన్నికలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని లేదా అన్ని జాతీయ కార్మిక సంఘాలను సమావేశాలకు పిలవాలని గత నెల 27న జాతీయ కార్మిక సంఘాల ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలోనే జరగబోయే సింగరేణి ఎన్నికల్లో తమ నాయకుడి మెప్పు పొందేందుకు ఇప్పటినుంచే గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు అధికారంలో ఉండి ఒకే వర్గానికి చెందిన నాయకులు అందరికీ పదవులు ఇస్తూ తమకు ఎటువంటి పదవులు ఇవ్వడం లేదని తమ యూనియన్ లో చిన్నచూపు చూస్తున్నారని తగిన ప్రాధాన్యత ఉండటం లేదని ఇప్పటికే పలువురు నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సింగరేణిలో ఎన్నికలు జరగాలని జాతీయ కార్మిక సంఘాలు పట్టుబడుతున్న నేపథ్యంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో విభేదాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తూ గ్రూప్ రాజకీయాలతో సింగరేణిలో చర్చనీయాంశంగా మారుతోంది. అయితే సింగరేణి వ్యాప్తంగా యూనియన్ లోని అన్ని ఏరియాల్లో ఇదే ప‌రిస్థితి ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు బయట పడకుండా సింగ‌రేణిలో వర్గపోరు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. బ‌య‌ట‌కు క‌నిపించ‌క‌పోయినా నివురుగ‌ప్పిన నిప్పులా గ్రూపులు కొన‌సాగుతున్నాయి. నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత తీవ్రస్థాయిలో విభేదాలు జరుగుతున్నట్లు జోరుగా సింగరేణి వ్యాప్తంగా చర్చ సాగుతోంది. గతంలో సైతం ఇలాగే గ్రూప్ రాజకీయాలతో సింగ‌రేణి గుర్తింపు సంఘం ఎన్నిక‌ల్లోనే ఆ యూనియ‌న్ ఓడిపోయే ప‌రిస్థితి నెలకొనడంతో దీనిపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో గట్టెక్కిన పరిస్థితులు నెలకొన్నాయి. మొద‌టి నుంచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో కొన‌సాగుతున్న ఈ గ్రూపు రాజ‌కీయాలు ఇప్పటికీ ఆ యూనియ‌న్‌ను వీడ‌టం లేదు.

టీబీజీకేఎస్ లో మళ్లీ మొదటికొచ్చిన పంచాయతీ

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో యూనియన్ పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చిందా..? అంటే అవుననే వాదనలు కార్మికుల నుండి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీబీజీకేఎస్ లో మూడు గ్రూపులు కొన‌సాగుతున్నాయి. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేసిన కెంగ‌ర్ల మల్లయ్య పార్టీలో అంతర్గత విభేదాలతో సొంత పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి రాజీనామా చేసి బీఎంఎస్ లో చేరారు. ఆ తర్వాత మళ్లీ అధిష్టాన నాయకులతో సంప్రదింపులు జరిపిన అనంతరం తిరిగి సొంత గూటికి చేరారు. అధ్యక్షుడు వెంక‌ట్రావ్‌, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మరో రెండు వర్గాలుగా కొనసాగుతున్నారు. ప్రతి ఏరియాలో త‌మ వ‌ర్గం ఉండాల‌నే నేత‌ల తాపత్రయంతో సింగరేణి వ్యాప్తంగా ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. వెంక‌ట్రావ్ మొద‌ట్లో ఐఎన్‌టీయూసీలో ఉండేవారు. ఆయ‌న యూనియ‌న్ మారిన‌ప్పుడు త‌న వారిని అంద‌రినీ వెంట తీసుకువ‌చ్చారు. త‌న‌తో వ‌చ్చిన వారంద‌రికీ ప‌ద‌వులు ఇప్పించాల‌నే సంక‌ల్పంతో పాత వారికి ఇబ్బందులు త‌ప్పలేదు. దీంతో మొద‌టి నుంచి త‌మ‌కు ప‌దవులు కాద‌ని మధ్యలో వ‌చ్చిన వారికి ఎలా ఇస్తారంటూ ఏరియాల వారీగా గొడ‌వ‌లు జరగడం అప్పట్లో సింగరేణి వ్యాప్తంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చర్చనీయాంశంగా మారింది. నాటి పరిస్థితులే పునరావృతమై నేడు అలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. రామ‌గుండం ఏరియాలో గ్రూపు త‌గాదాల‌కు పెట్టింది పేరుగా సాగుతోంది. అగ్రనేతలు ఇక్కడే ఉండ‌టంతో నిత్యం ఇక్కడ త‌న్నులాట‌లే. దామోద‌ర్‌రావు వెంక‌ట్రావ్ వ‌ర్గం కాగా, పెంచాల తిరుప‌తి, వ‌డ్డేప‌ల్లి శంక‌ర్‌, శ్యాంస‌న్ రాజిరెడ్డి వ‌ర్గంగా సాగుతున్నారు. కొద్ది రోజుల కింద‌ట సాక్షాత్తు జీఎం కార్యాల‌యంలోనే దామోద‌ర్‌రావు పై దాడి జరగడంతో స్పందించిన అధినాయకత్వం పలువురు నాయకులపై వేటు వేసింది. ఈ గొడ‌వలో తిరుప‌తితోపాటు మ‌రొక‌రిని స‌స్పెండ్ చేసింది.

నాటి నుండి నేటి వరకు అదే పరిస్థితి

టీబీజీకేఎస్‌ గుర్తింపు సంఘంగా గెలుపొందిన నాటి నుంచి నాయకుల్లో వర్గ పోరు మొదలైందని కార్మికులు చెబుతున్నారు. వర్గపోరుతో అనేక సార్లు రోడ్డున పడడం తప్ప, కార్మికులకు చేసింది ఏమీ లేదని జాతీయ కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. గోదావరిఖనిలో జరిగిన ఓ సమావేశంలో టీబీజీకేఎస్‌ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్‌ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం కూడా చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో ఉద్యోగాలు మొదలుకొని, అత్యంత కీలకమైన మెడికల్‌ అన్‌ఫిట్‌, మెడికల్‌ బోర్డులో, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాల్లో కొందరు టీబీజీకేఎస్‌ నాయకుల జోక్యం పెరిగిందని మిగతా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కార్మికుల సమస్యల పట్ల వివక్ష, అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు మూట గట్టుకున్న నేపథ్యంలో ఎన్నికలకు వెళ్లితే టీబీజీకేఎస్‌కు నష్టం తప్ప లాభం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా రెండు వ‌ర్గాల మ‌ధ్య పోరు కొన‌సాగుతుండ‌గా, కొన్ని చోట్ల కెంగ‌ర్ల మల్లయ్య వ‌ర్గం ప్రత్యేకంగా ఉంది. త‌మ నేత సైలెంట్‌గా ఉండ‌టంతో వారు కూడా ప్రస్తుతానికి నిశబ్ధంగా ఉన్నారు. అధిష్టానం జోక్యం ఇప్పటికైనా ఈ గ్రూపుల గొడ‌వ త‌గ్గించ‌క‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ యూనియ‌న్‌కు ఓట‌మి ఖాయ‌మ‌ని ప‌లువురు తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌లే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ గ్రూప్ రాజకీయాలపై అధిష్టానం దృష్టి సారించి ఈ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed