గ్రేట‌ర్ విజ‌యం ట్రైల‌రే: జితేంద‌ర్‌రెడ్డి

by  |
గ్రేట‌ర్ విజ‌యం ట్రైల‌రే: జితేంద‌ర్‌రెడ్డి
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్ : దుబ్బాక ఉప ఎన్నిక‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్‌ ఎన్నిక‌ల్లో బీజేపీ సాధించిన విజ‌యాలు కేవ‌లం ట్రైల‌ర్లు మాత్ర‌మేన‌ని వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్, ‌మాజీ ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి అన్నారు. మున్ముందు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు అస‌లు సినిమా చూపిస్తామ‌ని చెప్పారు. పోరుగ‌డ్డ‌పై బీజేపీ బావుటా ఎగుర‌వేసేందుకు ఎంతో ఆతృత‌తో ఎదురు చూస్తున్నామ‌ని అన్నారు. ఖమ్మం బై పాస్ రోడ్డులోని సిద్దం కన్వెన్షన్ హాల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శక్తి కేంద్రాల ప్రముఖ్‌‌ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యులు గ‌రిక‌పాటి రాంమోహ‌న‌రావు, మాజీ మంత్రి విజ‌య‌రామారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

బీజేపీ శ్రేణుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యే ముందు జితేంద‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం లేద‌ని అన్నారు. ఇప్ప‌టికిప్పుడు పోలింగ్ పెట్టినా ప్ర‌ధాన‌మంత్రి మోదీ నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తిచ్చేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని అన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ పనులకు అనుమతివ్వాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కోరిన కేసీఆర్‌పై కేంద్రానికి విశ్వ‌స‌నీయ‌త లేద‌ని అన్నారు. వంగివంగి దండాలు పెట్టినా.. పొర్లు దండాలు పెట్టినా కేసీఆర్‌ను కేంద్రం న‌మ్మ‌దని అన్నారు. క‌మిష‌న్ల‌తో కేసీఆర్ త‌న‌ జేబులు నింపుకోవ‌డానికే కాళేశ్వ‌రం ప్రాజెక్టును వాడుకుంటున్నార‌ని, మూడో టీఎంసీతో బ‌డ్జెట్‌ను ఒక ల‌క్ష 15వేల కోట్ల‌కు పెంచుకోవ‌డ‌మే ఆయ‌న ల‌క్ష్య‌మ‌ని ఆరోపించారు. క‌మీష‌న్లు తీసుకోవ‌డం, కాళేశ్వ‌రాన్ని పూర్తి చేయ‌క‌పోవ‌డ‌మే కేసీఆర్ ల‌క్ష్య‌మ‌ని అన్నారు.



Next Story

Most Viewed