మనవరాలిపై అమ్మమ్మ అమానుషం

by  |
మనవరాలిపై అమ్మమ్మ అమానుషం
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు ఆడపిల్ల అని స్కానింగ్ లో తెలిస్తే గర్భంలోనే చంపేసేవారు. చట్టాలు కఠినతరం చేయడంతో లింగనిర్ధారణ పరీక్షలు జరిపించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆడైనా, మగ అయినా జన్మించాకే తెలుస్తోంది. ఒకవేళ పుట్టింది ఆడపిల్ల అయితే వడ్ల గింజ వేసో… గొంతు నులిమో చంపేసేవారు.

కానీ మనుషులు మారారు. ఈమధ్య ఆడపిల్లలను పుడితే చంపేయట్లేదు. అమ్మేస్తున్నారు… అది కూడా కన్నా తల్లికి తెలియకుండా…! ఈ పాపానికి ఒడిగట్టింది పసికందు అమ్మమ్మే అయితే ఎంతటి అమానుషం? కరీంనగర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వీణవంక మండల కేంద్రంలో నాలుగు నెలల పసికందును అమ్మమ్మ అమ్మేసింది.

చిన్నారిని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన సంపత్, తిరుపతమ్మ దంపతులు లక్షా పదివేలకు కొనుగోలు చేసినట్లు తేలింది. బిడ్డ కనిపించక పోయేసరికి తల్లి పద్మ తల్లడిల్లుతూ తన తల్లి కనకమ్మను నిలదీసింది. పాపను అమ్మేసిన విషయాన్ని కనకమ్మ బయటపెట్టింది. దీంతో పద్మ తన భర్త రమేష్ కు సమాచారం ఇవ్వడంతో… ఆయన వచ్చి అత్తతో గొడవ పడ్డారు.

ఈ ఘటనపై స్థానికులు 100కు ఫోన్ చేయగా… పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పసిపాపను మళ్ళీ తల్లి చెంతకు చేర్చారు. పాపను అమ్మిన కనకమ్మను, కొనుగోలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పిల్లలను అమ్మినా, కొన్నా నేరమని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed