వంటనూనె ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం ప్రయత్నాలు

by  |
వంటనూనె ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం ప్రయత్నాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లో గతేడాది నుంచి వంటనూనె ధరలు భారీ పెరిగాయి. ఓవైపు ప్రజల నుంచి తీవ్రంగా అసహనం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ధరల సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర చర్యలు చేపడుతోంది. క్లియరెన్స్ సమస్యలతో ఓడరేవుల్లో నిలిచిపోయిన వంటనూనెల దిగుమతి జరిగిన తర్వాత దేశీయంగా నూనె ధరలు అదుపులోకి వస్తాయని కేంద్రం సోమవారం ఆశాభావం వ్యక్తం చేసింది. అనుమతుల ప్రక్రియతో పాటు పలు అంతరాయాల వల్ల ఓడరేవుల్లో నిలిచిపోయిన స్టాక్ దిగుమతి జరిగితే దేశంలో వంట నూనెల ధరలు తగ్గుతాయని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే అన్నారు. దీనికి సంబంధించి కస్టమ్స్, దేశ ఆహార భద్రతా ప్రమాణాల మండలి(ఎఫ్ఎస్ఎస్ఏఐ)తో చర్చించి పరిష్కరించే చర్యలు తీసుకున్నామని సుధాన్షు పాండే వివరించారు.

కరోనా మహమ్మారితో పాటు గత కొన్నేళ్లుగా వంటనూనెల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న క్రమంలో వంటనూనె ధరలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, మార్కెట్లో వంటనూనెల కొరతను తీర్చేందుకు దిగుమతులపైనే మనం ఆధారపడ్డామని ఆయన తెలిపారు. సాధారణంగా భారత్ ఏటా రూ. 75 వేల కోట్ల విలువైన నూనెల దిగుమతులను అందుకుంటోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మే మొదటివారానికి వనస్పతి రిటైల్ ధర కిలో 55.55 శాతం పెరిగి రూ. 140కి చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో దీని ధర రూ. 90గా ఉంది. పామాయిల్ రిటైల్ ధర కిలోకు రూ. 87.5 నుంచి 51.54 శాతం పెరిగి రూ. 132.6కి, సోయా నూనె 50 శాతం పెరిగి రూ. 105 నుంచి రూ. 158కి, వేరుశెనగ నూనె 38 శాతం పెరిగి రూ. 180కి చేరుకుంది.

Next Story