నిజంగా మీ కృషి చాలా గొప్పది: తెలంగాణ గవర్నర్

by  |
Governor-1
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాహసాని, ధైర్యానికి, పరాక్రమానికి నేషనల్ సెక్యూరిటీ గార్డులు ప్రతీక అని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు. దేశ భద్రతా కార్యకలాపాల్లో ఎన్ఎస్‌జీ కృషి భిన్నమైనదని, శిక్షణ మొదలు బాధ్యత వరకు వారి పాత్ర ప్రశంసనీయమన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని పీపుల్స్ ప్లాజాలో జరిగిన ‘సుదర్శన్ భారత్ పరిక్రమ’ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. దేశంలోని పలు నగరాల్లోని వార్ మెమోరియల్ స్థలాలను సందర్శిస్తూ ఎన్ఎస్‌జీ చేపట్టిన ‘బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ’ని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రపతి మొదలు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నవారికి ఎన్ఎస్‌జీ వ్యక్తిగత భద్రత కల్పిస్తున్నదని, ఇందుకోసం ఆయుధాల వినియోగంతోపాటు అనేక అంశాల్లో ప్రత్యేక శిక్షణ కలిగిన బలగాలు మార్షల్ ఆర్ట్స్ విద్యలోనూ నిష్ణాతులని వారి కృషిని కొనియాడారు. ఎన్ఎస్‌జీ తరహా భద్రతా సంస్థల వల్లనే దేశంలో ప్రశాంత వాతావరణం నెలకొన్నదని గుర్తుచేశారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరుతో 1988లో, ఆపరేషన్ వజ్రశక్తి పేరుతో గుజరాత్‌లో 2002లో, ఆపరేషన్ టొరంటో పేరుతో 2008లో ప్రత్యేక కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ కార్యక్రమాలను నిర్వహించిందని, ఈ విభాగం ఆవిర్భవించింది మొదలు ప్రత్యేకతను చాటుకుని సక్సెక్ సాధించిందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే ఉత్తమమైన భద్రతా విభాగాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందన్నారు.

Governor-2

మార్షల్ ఆర్ట్స్ అవసరాన్ని గుర్తించి విద్యాసంస్థల్లో సిలబస్‌లో భాగంగా దీన్ని తీసుకురావడంపై ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు. మొత్తం పన్నెండు రాష్ట్రాల్లోని 18 నగరాలను కవర్ చేస్తూ సుమారు ఏడున్నర వేల కి.మీ. మేర ‘బ్లాక్ క్యాట్ కార్ ర్యాలీ’ ఈ నెల 30న ఢిల్లీకి చేరుకోనున్నది.

Next Story

Most Viewed