మొండి బకాయిలల్లో ‘సర్కార్’ ఫస్ట్.. ఎలక్ట్రిసిటీకి రూ.15.66 కోట్ల ఎగనామం

by  |
Electricity bills
X

దిశ, ఆదిలాబాద్ : సామాన్యుల నుంచి ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తున్న విద్యుత్ శాఖ ప్రభుత్వ కార్యాలయాలను చూసీచూడనట్లు వదిలేస్తోంది. వివిధ శాఖలు ఏళ్ల తరబడి విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆ శాఖకు కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని విద్యా శాఖ, పంచాయతీరాజ్, కార్పొరేషన్, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ తదితర ఇతర శాఖల నుంచి కోట్ల రూపాయల బిల్లులు రావాల్సి ఉన్నాయి. ఈ మొండి బకాయిల వసూళ్లకు విద్యుత్ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ చేపట్టాయి. నోటీసులను జారీ చేసి వసూళ్లను రాబట్టేందుకు చర్యలు చేపడుతోంది.

ప్రత్యేక బృందాల ఏర్పాటు..

జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల బకాయిల వసూలు కోసం విద్యుత్ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఏఈ, డీఈ స్థాయి అధికారులను నియమించి ఆయా శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా వసూలు చేయడానికి ప్రణాళికలను రూపొందించారు. విద్యుత్ శాఖ అధికారులు బకాయిలు ఉన్న కార్యాలయాలకు వెళ్లి నోటీసులను అందజేస్తున్నారు.

నేటికీ పని చేయని ప్రీపెయిడ్ మీటర్లు

ఇదిలా ఉంటే ఆయా శాఖల్లో ఏర్పాటు చేసిన ప్రీపెయిడ్ మీటర్లు పేరుకే ఉన్నాయి. రెండేళ్ల క్రితమే వాటిని బిగించినప్పటికీ నేటికీ పని చేయడం లేదు. ఆయా శాఖలతో పాటు పలు సంస్థల కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లోని వినియోగంలోకి తీసుకు రావాల్సి ఉండగా.. పాత పద్ధతిలోనే బిల్లులను వసూలు చేస్తున్నారు. దీంతో వారికి మొండి బకాయిలు కోట్లలో పేరుకుపోయాయి.

శాఖల వారీగా బకాయిలు లక్షల్లో

పశుసంవర్ధక 1.35
వ్యవసాయ 1.94
బీసీ వెల్ఫేర్ 3.3
బీఎస్ఎన్ఎల్ 14.76
కోర్టు 0.23
అగ్నిమాపక 15.2
అటవీ 37.85
ఆరోగ్య 41.23
హోమ్ డిపార్ట్మెంట్ 0.61
హార్టికల్చర్ 66.76
ఐటీడీఏ 70.49
రెవెన్యూ 148.97
విద్యుత్ 8.58
సోషల్ వెల్ఫేర్ 6.9
లిఫ్ట్ ఇరిగేషన్ 0.14
కమర్షియల్ టాక్స్ 25.04
జీపీ వీధి దీపాలు 211.14
జీపీ వాటర్ వర్క్స్ 208.32
మొత్తం 1566.15



Next Story