‘ఉపాధి హామీకి మరింత ఖర్చు చేసే యోచన’

by  |
‘ఉపాధి హామీకి మరింత ఖర్చు చేసే యోచన’
X

దిశ, వెబ్‌డెస్క్: భవిష్యత్తులో అవసరమైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకం కింద ఖర్చులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్పారు. పేద, బలహీన గ్రామీణ ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందని, కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఉపాధిని కోల్పోయిన వారికి గ్రామీణ ప్రాంతాల్లో అదనపు ఉద్యోగాలను కల్పించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1.11 లక్షల కోట్లను కేటాయించినట్టు అనురాగ్ సింగ్ పేర్కొన్నారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కోసం రూ. 61,500 కోట్ల నుంచి రూ. 73 వేల కోట్లకు పెంచినట్టు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో చాలామంది కార్మికులు ఇంటికెళ్లారు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలను కల్పించడం ముఖ్యం. కరోనా ప్రభావం నుంచి కార్మికులు తిరిగి పనుల్లోకి వస్తున్నారు. కాబట్టి అవసరాలకు భారీగా లేకపోయినప్పటికీ డిమాండ్‌ను బట్టి ఈ పథకం కోసం ఖర్చును పెంచే అవకాశాలున్నాయని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు అధికంగా 9.5 శాతంగా ఉందని, దీన్ని 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.

Next Story

Most Viewed