గవర్నమెంట్ ప్లీడర్లకు బాకీపడ్డ సర్కార్

by  |
Advocate
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నో కేసులకు పరిష్కారం చూపే ప్రభుత్వ ప్లీడర్లకు తెలంగాణ సర్కార్ వేతనాలు అందించడం లేదు. 20 నెలలుగా వారికి జీతాలు చెల్లించకుండా మొండిచేయి చూపుతోంది. గవర్నమెంట్ ప్లీడర్ల నుంచి మొదలు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వరకు అందరూ అదే బాధను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కోర్టులున్నాయి. అయితే అందులో పనిచేసే ప్లీడర్లకు మాత్రం డబ్బులిచ్చేందుకు ప్రభుత్వం ఏమాత్రం జాలి చూపడం లేదు.

తెలంగాణలో హజురాబాద్ ఎన్నికల కోసం దళితబంధు పథకానికి సీఎం శ్రీకారం చుట్టారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు వచ్చేలా చూస్తామన్నారు. నిరుపేదలకే కాక విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ పథకానికి ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్ గవర్న్ మెంట్ ప్లీడర్లకు మాత్రం వేతనాలు అందించకపోవడంపై విమర్శలపాలవుతున్నారు. ప్రభుత్వ ప్లీడర్లు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లుగా విధులు నిర్వర్తిస్తున్న లా ఆఫీసర్లకు 2019 నవంబర్ నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. ఒక్క ఉమ్మడి కరీనంగర్ జిల్లాకు చెందిన ఒక్కో అధికారికి ఇవ్వాల్సిన మొత్తం రూ.3 లక్షల నుంచి మొదలుపెడితే రూ.11 లక్షల వరకు బకాయిలు పేరుకుపోయాయి. ఒక ప్రభుత్వ ప్లీడర్, ముగ్గురు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లకు చెల్లించాల్సిన మొత్తమే రూ.25 లక్షల పైచిలుకు ఉండటం గమనార్హం.



Next Story