ఫారెస్ట్ భూమి.. చూసేవారు లేరేమి..!!

by  |
ఫారెస్ట్ భూమి.. చూసేవారు లేరేమి..!!
X

దిశ, వేములవాడ: ఫారెస్ట్ నుంచి తట్టెడు మట్టి తిస్తేనే కేసులు పెట్టి హడావిడి చేసే ఫారెస్ట్ అధికారులు, ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎకరాలలో మట్టిని తీసి ఉపయోగిస్తున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఫారెస్ట్ భూములు అన్యాక్రాంతం కాకుండా బౌండరీ పిల్లర్లు నిర్మాణం చేపట్టారు. కానీ సదరు కాంట్రాక్టర్ సగం పిల్లర్లు మాత్రమే నిర్మించి, బిల్లులు తీసుకొని పత్తా లేకుండాపోయాడు. నిర్మించిన పిల్లర్లు కూడా ప్రాజెక్ట్‌లోకి నీళ్లు వస్తే మునిగిపోతాయి. ఇప్పుడా నిర్మించిన పిల్లర్లు చుట్టూ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మట్టి తీయడంతో కూలిపోయేందుకు సిద్దంగా ఉన్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనారావుపేట మండలం మల్కపేట గ్రామంలో 3 టీఎంసీ ల సామర్థ్యం గల ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. సుమారు 600 వందల ఎకరాల్లో ప్రాజెక్ట్ పనులు చేస్తున్నారు. ఇందులో రెవెన్యూ, ఫారెస్ట్ భూములు పోతుండగా, ఫారెస్ట్ భూములను కాపాడేందుకు బౌండరీ పిల్లర్లు నిర్మించేందుకు అటవీ శాఖ టెండర్లు పిలిచింది. ప్రాజెక్ట్ చుట్టూ 1200 బౌండరీ పిల్లర్లు నిర్మించేందుకు ప్రతి పిల్లరుకు రూ.9 వేల వరకు నిధులు కేటాయించింది. కాగా సదరు కాంట్రాక్ట్ 600 బౌండరీ పిల్లర్లు నిర్మించి బిల్లులు తీసుకొని పారిపోయాడు.

అటవీ శాఖ ఖజానాకు గండి..
మల్కపేట ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపుకు గురయ్యే బౌండరీ పిల్లర్లు నిర్మించి, అటవీ శాఖ ఖజానాకు అధికారులు గండి కొడుతున్నారు. ప్రాజెక్ట్‌లో మునిగిపోయే పిల్లర్లు ముందు కట్టి, ప్రాజెక్ట్ చుట్టూ కట్టాల్సిన పిల్లర్లు మాత్రం కట్టలేదు. దీంతో ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకొని మట్టిని తరలిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పిల్లర్లు ప్రాజెక్ట్‌లో మునిగిపోకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.



Next Story