గుడ్‌న్యూస్: ఆ ఉద్యోగులకు ఏ పరీక్షలూ నిర్వహించం

by  |
Ward Secretariat Employees
X

దిశ, ఏపీ బ్యూరో: గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎవరూ ప్రొబేషన్ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ సూచించారు. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు మినహా ఎలాంటి పరీక్షలు ఉండబోవని ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీబీఏఎస్ కానీ ఏ ఇతర అదనపు పరీక్షలు కానీ ఉద్యోగులకు నిర్వహించరని క్లారిటీ ఇచ్చారు. 2019 అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఏర్పాటు చేశారని అప్పటి నుంచి రెండేళ్లు పూర్తి చేసుకున్న 1.34 లక్షల మంది ఉద్యోగులంతా కేవలం డిపార్టుమెంటల్ పరీక్షలు పాసైతే చాలు అని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ స్పష్టం చేశారు.

గ్రామ/ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హర్షం

రాష్ట్రంలో గత రెండు వారాలుగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌పై వస్తున్న రకరకాల వార్తలకు చెక్ పెడుతూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రకటన విడుదల చేయడంపట్ల గ్రామ/ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.డి.జాని పాషా హర్షం వ్యక్తం చేశారు.

ఎటువంటి క్రెడిట్ బేస్ అసెస్మెంట్ టెస్ట్ లేకుండా సాధారణంగా ఆరు మాసాలకు ఒకసారి ఏపీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ టెస్ట్‌లను పరిగణలోకి తీసుకొని వాటిలో ఉత్తీర్ణులైన వారికి నేరుగా అక్టోబర్ 2నాటికి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.34లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సువర్ణ అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు ఎండీ జానీ పాషా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed