కస్తూర్బా స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్

by  |
కస్తూర్బా స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకూ ఈ 36 కస్తూర్బా విద్యాలయాల్లో పదవ తరగతి వరకు మాత్రమే అవకాశం ఉన్నా ఇంటర్ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇటీవల ఈ అంశాన్ని చర్చించామని, సానుకూలం నిర్ణయం వచ్చిందని, ఆ ప్రకారమే 36 కేజీబీవీల్లో ఇంటర్‌ స్థాయి వరకు తరగతులను పెంచినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.

కొత్తగా ఇంటర్ అవకాశం లభించిన 36 కస్తూర్బా విద్యాలయాల్లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ గ్రూపులు ఉంటాయని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 475 కస్తూర్బా విద్యాలయాల్లో ఇప్పటికే ప్రభుత్వం 172 స్కూళ్ళలో తరగతులను ఇంటర్‌ స్థాయి వరకు పెంచింది. అన్నీ బాలికల విద్యాలయాలే కావడంతో ప్రభుత్వమే పూర్తి ఖర్చులను భరిస్తున్నదని, పౌష్టికాహారంతోపాటు నాణ్యమైన విద్యను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా చదువుతోపాటు నాయకత్వ లక్షణాలు, కరాటే, యోగా, ధ్యానం తదితర అంశాల్లో కూడా శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని బాలికలు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed