బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న ధరలు!

by  |
Gold
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా బంగారం డిమాండ్ గణనీయంగా బలపడుతుందని ప్రపంచ స్వర్ణ మండలి(డబ్ల్యూజీసీ) అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం, దేశీయంగా పండుగ సీజన్ కారణంగా ఆభరణాల అమ్మకాలు పెరిగేందుకు దోహదపడుతుందని డబ్ల్యూజీసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. అధిక డిమాండ్ నేపథ్యంలో ఈ ఏడాది పసిడి ధరలు ఇప్పటివరకు 5 శాతం దిగొచ్చాయి. అయితే, మెటల్ దిగుమతులు పెరగడం వల్ల వాణిజ్య పెరుగుదల, రూపాయి మారకంపై ప్రభావం చూపుతుందని డబ్ల్యూజీసీ పేర్కొంది.

‘ప్రత్యేకంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికం గత కొన్నేళ్లలోనే అత్యుత్తమ త్రైమాసికాల్లో ఒకటిగా ఉండనుంది. డిమాండ్ పెరగడం, బంగారం ధరలు తగ్గుదల, వివాహ ముహుర్తాలతో డిమాండ్ మరింత పెరుగుతుందని, ప్రతి ఏటా భారత్‌కు ఏడాది చివర్లో దసరా, దీపావళి సందర్భంగా పసిడి అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని, ఈసారి మరింత ఎక్కువగా ఉండొచ్చని’ డబ్ల్యూజీసీ భారత కార్యకలాపాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సోమసుందరం అన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు గతేడాది కంటే 187 శాతం పెరిగి 255.6 టన్నులకు చేరుకున్నాయి. ఆభరణాల డిమాండ్ 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరుకుంది. దీంతో బంగారం డిమాండ్ 47 శాతం వృద్ధితో 139.1 టన్నులకు చేరుకుందని డబ్ల్యూజీసీ గురువారం తన నివేదికలో వివరించింది.

కాగా, ప్రస్తుతం పండుగ సీజన్ ఉన్నప్పటికీ బంగారం ధరలు సైతం స్థిరంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 200 పెరిగి రూ. 44,950 ఉండగా, స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 220 పెరిగి రూ. 49,040 వద్ద ఉంది.


Next Story

Most Viewed