ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్య ..

by  |
ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్య ..
X

దిశ,వెబ్‌డెస్క్: వికారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణ హత్యకు గురైంది. యాలాల మండలం పగిడాల గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. పగిడాల గ్రామానికి చెందిన బేకరీ లక్ష్మికి తాండూరు పట్టణంలోని పాత తాండూర్‌కు చెందిన నీరటి బాలప్పతో 15ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బాలప్పను వదిలేసి లక్ష్మి తన తల్లిగారి ఇంటివద్దనే ఉంటోంది. ఈ క్రమంలో పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన మాల నరసింహతో ఆమె సహజీవనం చేస్తోంది. సొంత అవసరాలకోసం లక్ష్మీ వద్ద నరసింహా రూ.40 వేలను అప్పుగా తీసుకున్నాడు.

కాగా ఇచ్చిన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలంటూ నర్సింహులుపై లక్ష్మి పలుమార్లు ఒత్తిడి తెచ్చింది. డబ్బుల విషయంలో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డబ్బులు తిరిగి ఇస్తానని నమ్మించిన నర్సింలు లక్ష్మిని తీసుకొని రాస్నానం గ్రామానికి వెళ్దామని తమ వెంట తీసుకు వెళ్ళాడు. మార్గం మధ్యలో నిర్మానుష్య ప్రదేశంలో ఇరువురు మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉండగా లక్ష్మి గొంతును నర్సింహా బ్లేడుతో కోసి హత్య చేశాడు. ఇదిలా ఉంటే లక్ష్మి కనిపించక పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అనుమానంతో నరసింహను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా లక్ష్మిని తానే హత్య చేసినట్టు నరసింహ ఒప్పుకున్నాడు.


Next Story