అన్న అలా అన్నాడని చెల్లి సూసైడ్

by  |
అన్న అలా అన్నాడని చెల్లి సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: సెల్ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడకూడదని సోదరుడు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఓల్డ్ బోయిన్ పల్లి గంగపుత్ర సంఘం బస్తీకి చెందిన దగ్గు సమత(19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. గత కొద్దిరోజులుగా సమత సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడుతున్నట్లు గుర్తించిన అన్న సాయికిరణ్ ఆమెను మూడు రోజుల క్రితం మందలించాడు.

ఈ విషయమై ఈ నెల 6వ తేదీ రాత్రి కూడా సమత, సాయి కిరణ్ కి మధ్య గొడవ జరిగింది. బుధవారం ఉదయమే నిద్రలేచిన సమత రోజులాగే మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చి బోర్డు ఆన్ చేసి అనంతరం తన తాతయ్య ఉండే పెంట్ హౌస్ లోకి వెళ్లింది. ఆమె ఎంతకు కిందకు రాకపోవడంతో సాయికిరణ్ పెంట్ హౌస్ వద్దకు వెళ్లి చూడగా లోపలి నుంచి గడియ వేసి ఉంది. తలుపును ఎంత తట్టినా సమత తీయలేదు. దీంతో సాయికిరణ్ స్థానికుల సహాయంతో తలుపు బద్దలుగొట్టి చూసేసరికి సమత ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని కనిపించింది.

స్థానికులు సమతను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించగా ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం కొద్దిసేపటికే సమత కొన ఊపిరితో ఉందంటూ స్థానికులు ఆమెను తిరిగి స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్ దవాఖానకు తీసుకువెళ్లారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు కూడా నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed