ఫలించిన 'దిశ' కథనం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్

by  |
ఫలించిన దిశ కథనం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత మూడు నెలలుగా కొవిడ్ బారిన పడి విధులకు హాజరుకాలేకపోయిన కార్మికులకు జీహెచ్ఎంసీ శుభవార్త ప్రకటించింది. కొవిడ్ చికిత్స కోసం 14 రోజులు ఐసోలేషన్, ఆస్పత్రుల్లో ఉన్నవారికి జీతాలు కట్ చేసి వేస్తున్నారన్న ‘దిశ’ కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ.. పాజిటివ్ వచ్చిన వారందరికీ పూర్తి వేతనాలు ఇస్తామని ప్రకటించింది. నగరంలో కోవిడ్ నియంత్రణ కోసం నిరంతరం పనిచేస్తున్న పారిశుధ్య, ఎంటమాలజీ కార్మికులు వైరస్ బారిన పడుతున్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ముందుండి ప్రజలకు సేవలందించే క్రమంలో కరోనా బారిన పడుతున్నారు. గతేడాది వీరి జీతాల్లో ఎలాంటి కోతలు విధించకపోయినప్పటికీ.. ఈ సారి రాని రోజులకు కట్ చేసి ఇస్తున్నారు. ఏప్రిల్ ఒక్క నెలలోనే నాలుగొందల మంది కార్మికులు ఈ విధంగా జీతాలు అందుకోలేకపోయారు. కొవిడ్ కారణంగా అనారోగ్యం పాలయ్యి, ఉన్న డబ్బులు ఖర్చు చేస్తుంటే.. మరో వైపు జీతాల్లో కోత విధించడంతో కార్మికులు మరింత వేదనకు గురయ్యారు.

కార్మికుల అవస్థలపై ఈ నెల 20న (గురువారం) రోజు ‘కరోనా వస్తే జీతం కట్’ కథనాన్ని ‘దిశ’ ప్రచురించింది. దీంతో స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు.. పాజిటివ్ వచ్చిన కార్మికులకు కూడా పూర్తి జీతం ఇవ్వనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పాజిటివ్ వచ్చిన కార్మికులు తమ టెస్ట్ రిపోర్టులను గానీ ప్రభుత్వ అధికారిక పోర్టల్ లో పాజిటివ్ నిర్థారిత వివరాలను సమర్పించాలని సూచించింది. కార్మికులు తమ పాజిటివ్ రిపోర్టులను సర్కిల్ అధికారులకు అందించి పూర్తి జీతాలను పొందొచ్చని జీహెచ్ఎంసీ ప్రకటించింది.

Next Story

Most Viewed