జీహెచ్ఎంసీ సంచలన తీర్మానం !

by  |
జీహెచ్ఎంసీ సంచలన తీర్మానం !
X

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. దేశంలోనే ఇలాంటి తీర్మానం చేసిన మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసి చరిత్ర సృష్టించింది. అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌కు చెందిన మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలలో తీర్మానం చేయడం చూశాం. కేరళతో మొదలైన ఈ పరంపర ఆ తర్వాత పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వరకూ వెళ్ళింది. త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే ఇలా అసెంబ్లీలో తీర్మానం జరగడానికి ముందే ఆ పార్టీ నాయకుడే మేయర్‌గా ఉన్న జీహెచ్ఎంసీ తీర్మానం చేసి సంచలనం సృష్టించింది.

రాష్ట్ర జనాభాలో దాదాపు 14% మేర ముస్లింలు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ముస్లింల జనాభా గణనీయంగానే ఉంది. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ర్యాలీలు జరుగుతున్న సమయంలో హైదరాబాద్ నగరంలో దాదాపు ఐదారు లక్షల మంది ప్రజలతో ముస్లిం ఫ్రంట్ నేతృత్వంలో భారీ ర్యాలీ జరిగింది. ముస్లింలంతా సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. కేవలం సీఏఏను మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం అమలుచేయనున్న ఎన్నార్సీని సైతం వ్యతిరేకిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసింది. ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్ ఈ మేరకు తీర్మానం చేయాల్సిందిగా ప్రతిపాదించగా చర్చల అనంతరం తీర్మానం జరిగింది.

సీఏఏకు, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన తొలి మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ గుర్తింపు పొందింది. అసెంబ్లీలో సైతం ఇదే పునరావృతం కానుంది.

Next Story

Most Viewed