గంతలు సరే.. మరి గుంతలూ!

by  |
గంతలు సరే.. మరి గుంతలూ!
X

దిశ, న్యూస్​ బ్యూరో: కోటి జనాభా దాటిన నగరంలో కనీస వసతుల కల్పన సరిగ్గా లేకపోయినా సుందరీకరణ వెంట బల్దియా అధికారులు పరుగులు తీస్తున్నారు. ప్రధాన రోడ్లలో ఎప్పుడు ఏ గుంత వచ్చి యాక్సిడెంట్​కు గురవుతామో అని భయపడుతూ వాహనదారులు వెళ్తున్నారు. రోడ్లపై మ్యాన్​హోళ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, రోడ్లు దాటడానికి జీబ్రాక్రాసింగ్​ల్లేక ప్రజలు ఒకవైపు అవస్థలు పడుతుంటే, మరోవైపు పనిచేయని ట్రాఫిక్​ సిగ్నళ్లు నిత్యం కనిపిస్తున్నాయి. ఇష్టారీతిలో రోడ్లను తవ్వుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడంలో కొన్ని శాఖలు ఇంకా బిజీగా ఉన్నాయి. వీటన్నింటిని నివారించి నగర ప్రజలకు సౌలభ్యంగా మార్చాల్సిన జీహెచ్​ఎంసీ అసలు పనులు వదిలేసి కొత్త పనులను తలకెత్తుకుంటోంది.
నగరంలోని రోడ్లపై గుంతల ఫొటోలు తీసి పంపిస్తే గుంతకు రూ.5 ఇస్తానని గతంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నమాటలు ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అలా అని హైదరాబాద్​ రోడ్లపై గుంతలు లేవంటే అదీ కాదు. ఫొటో తీసినా, ట్విట్టర్​లో ఫిర్యాదు చేసినా వారు అనుకుంటే తప్ప పనులు జరగవని ప్రజలకు అర్థమయింది. ఏడాది క్రితమే జీహెచ్​ఎంసీ రోడ్ల నిర్వహణలో లోపం కారణంగానే తనకు రోడ్​ యాక్సిడెంట్​ అయిందని ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్​ కూడా వేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఇటీవల బయోడైవర్సిటీ ఫ్లైఓవర్​ పై నుంచి కారు పడిపోయిన సంఘటలో జీహెచ్​ఎంసీ ఇంజనీర్ల డిజైన్​ లోపం కారణంగానే తన కారు యాక్సిడెంట్​ అయిందని వాహనదారుడు కోర్టు విచారణలో కౌంటర్​ ఫైల్​ దాఖలు చేశాడు. ఇలా వేల సంఖ్యలో ప్రజల నుంచి వ్యాజ్యాలను బల్దియా ఎదుర్కొంటోంది. కేవలం మౌలిక సౌకర్యాల విషయంలోనే సిటీలోని ప్రభుత్వ ప్రధాన విభాగం విమర్శల పాలవుతోంది. కనీసం రోడ్లపై గుంతలను పూడ్చటం మానేసిన బల్దియా పేరుతో రూ. కోట్లను ఖర్చు చేస్తోంది.
నగరంలోని రోడ్లు, సర్కిళ్ల సుందరీకరణ పేరుతో రూ.కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. సుందరీకరణను ఎవరూ కాదనడం లేదు. అయితే అదే రోడ్ల మీద కనీస అవసరాలకు ప్రాధాన్యతనివ్వాలని నగరవాసులు కోరుతున్నారు. ఉదాహరణకు ఖైరతాబాద్​ చౌరస్తాలో రూ.68 లక్షలను సుందరీకరణ పేరుతో ఖర్చు చేశారు. అదే చౌరస్తాలో రోడ్డు దాటేందుకు కనీసం జీబ్రా క్రాసింగ్​ కూడా లేకపోవడం గమనార్హం. అక్కడ సిగ్నల్స్​ కూడా రోజులో ఒకటి, రెండుసార్లు పనిచేయడం మానేస్తాయి. ఎంత సమయం రెడ్​ సిగ్నల్​ ఉంటుందో తెలిపే టైమర్లు కూడా లేవు. రోడ్లపై డ్రైనేజీ పొంగిపొర్లితే స్పందించేవారు కనిపించరు. వర్టికల్​ గార్డెన్​, లైటింగ్​ కోసం రూ. లక్షలు ఖర్చు చేశారు. ఖైరతాబాద్​ సర్కిల్​ నుంచి ఎటూ కిలోమీటర్​ దూరంలో కూడా జీబ్రాక్రాసింగ్ లేదు. ఆర్టీవో కార్యాలయం, ప్రెస్‌క్లబ్​, జీహెచ్​ఎంసీ సర్కిల్​ కార్యాలయం, మెట్రో, ఎంఎంటీఎస్​ రైల్వేస్టేషన్లు ఈ సర్కిల్​ చుట్టే ఉండటంతో నిత్యం వందలమంది ప్రజలు రోడ్లు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు లేని రోడ్లను నగరవాసులకు అందుబాటులోకి తీసుకొచ్చి, ఫ్రెండ్లీ పెడస్ట్రియన్​ ప్రాజెక్టులో భాగంగా ఫుట్​‌పాత్​లు, జీబ్రాక్రాసింగ్‌ల వంటి కనీస సదుపాయాలను ఏర్పరచిన తర్వాత బ్యూటిఫికేషన్​, ఇతర హంగులు ఎన్ని చేపట్టినా ప్రజలు ఆహ్వానిస్తారు.

Next Story

Most Viewed