ఈసారి కూడా పాత రిజర్వేషన్లే…

by  |
ఈసారి కూడా పాత రిజర్వేషన్లే…
X

జీహెచ్ఎంసీ యాక్టులో సవరణలకు రాష్ట్ర కేబినేట్ శనివారం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఎన్నికల కోసం బ్యాలెట్ బాక్స్‌లను ఎన్నికల అధికారులు వివిధ ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల అధికారి, మంత్రి కేటీఆర్ సైతం ప్రకటించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చట్టాన్ని సవరించారు. రిజర్వేషన్ల మార్పుపై కసరత్తు చేసే అవకాశం కనిపించడం లేదు. 2016 నాటి స్థానాల్లోనే రిజర్వేషన్లు ప్రకటించేందుకు ముసాయిదా సిద్ధం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీలో ఈసారి కూడా పాత రిజర్వేషన్లే అమలయ్యే అవకాలున్నాయి. గత ఎన్నికల్లోనూ 50 శాతం వరకు ఉన్న మహిళల స్థానాలను వారికే కేటాయించనున్నారు. 150 వార్డుల్లో ప్రస్తుతం 79 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. 2016 ఎన్నికల్లో మహిళలకు ఎస్టీ 1, ఎస్సీ 05, బీసీ 25 జనరల్ 44 మొత్తం 75 స్థానాలను కేటాయించారు. వీటితో పాటు అన్ రిజర్వ్డ్ కేటగిరీలోని 4 స్థానాల్లో కూడా మహిళలే గెలుపొందడంతో సంఖ్య 79కు చేరుకుంది. ఇవే స్థానాలను వచ్చే ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లోనూ సీట్ల కేటాయింపులో ఎలాంటి తేడా లేకపోయినా జీహెచ్ఎంసీ యాక్టులో చేర్చడం ద్వారా మహిళా ఓట్లను ఆకర్షించే ప్రయత్నంలో అధికార పార్టీ ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లను కొత్తగా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడాన్ని మహిళల సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు నిరూపించుకునేం దుకు టీఆర్ఎస్ కష్టపడుతోందని వారు చెబుతున్నారు.

పెత్తనమంతా భర్తలదే…

79 మంది మహిళా కార్పొరేటర్లలో అధికార పార్టీ నుంచే 56 మంది ఉన్నారు. వీరికి ఆయా డివిజన్లలోని ప్రజలతో నేరుగా సంబంధాలు అంతగా లేవు. చాలా చోట్ల వారి భర్తలే అన్ని వ్యవహా రాలు చక్కబెడుతారన్నది బహిరంగ రహస్యం. మంత్రి కేటీఆర్ కూడా ఇటీవల ఇదే విషయంపై కార్పొరేటర్ దంపతులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. 15శాతం మంది కార్పొరేటర్ల పనితీరు బాగాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 56 మహిళా స్థానాలను తిరిగి దక్కించుకోవడం అధికార పార్టీకి ప్రధాన సమస్యగా మారనుంది. ఎన్నికల సమయంలో సిట్టింగ్ మహిళా కార్పొరేటర్లు బయటకు వస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయం వ్యక్తమవుతోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed