ఎన్నెన్నో విజయాలు జీహెచ్ఎంసీ సొంతం

by  |
ఎన్నెన్నో విజయాలు జీహెచ్ఎంసీ సొంతం
X

కరోనా కాలంలోనూ జీహెచ్ఎంసీ అభివృద్ధిని పరుగులు పెట్టించింది. 2020లో గ్రేటర్ సిటీ డెవలప్​మెంట్ ​కోసం హర్నిశలు శ్రమించింది. నగర వాసులకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ట్రాఫిక్ ​ఫ్రీ సిటీ కోసం ప్రత్యేక ప్రణాళిలతో పనులు చేపట్టింది. నగరానికి మణిహారంగా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ ​బ్రిడ్జిని పూర్తి చేయడమే కాకుండా.. ఆహ్లాదాన్ని పంచే థీమ్​పార్క్‌లను ఏర్పాటు చేసింది. చారిత్రక కట్టడాలను పునరుద్ధరించి సొబగులు అద్దింది. వ్యర్థాల నుంచి విద్యుత్ ​ఉత్పత్తి ప్లాంట్, నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్ ​ప్లాంట్ భారీ ప్రాజెక్ట్​లను పూర్తి చేసింది. అంతేకాదు గ్రేటర్ ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్నా.. విజయవంతంగా పూర్తి చేసి శభాష్ అనిపించుకుంది. అనేక నూతన ఆవిష్కరణలకు ఈ ఏడాదే శ్రీకారం చుట్టింది. ప్రపంచాన్నే వణికించినా కొవిడ్19 సమయంలోనూ బల్దియా భేష్ అనిపించుకునేలా పనులు చేపట్టింది.

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా కల్లోలంలోనూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, ఎస్ఆర్డీపీ పనులను వేగవంతం చేసింది. నగరానికే నగిషీగా మారిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, థీమ్ పార్కులు ఈ సంవత్సరమే కొలువుదీరాయి. నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్, మున్సిపల్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభం వంటి అద్భుతాలు నెలకొల్పారు. బల్దియా ఆస్తుల పరిరక్షణ సెల్ ఏర్పాటు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా అనే విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే 2020 సంవత్సరం జీహెచ్ఎంసీ మౌలిక సదుపాయాల కల్పనలో స్వర్ణ సంవత్సరంగా చెప్పుకోవచ్చు.

విజయవంతంగా ఎన్నికల నిర్వహణ

డిసెంబర్ మొదటి వారంలో 150 వార్డులకు జరిగిన ఎన్నికలను అతితక్కువ సమయం ఉన్నప్పటికీ విజయవంతంగా నిర్వహించింది. సుధీర్ఘకాలం అనంతరం బ్యాలెట్ బాక్స్ ద్వారా నిర్వహించిన ఈ ఎన్నికల్లో దాదాపు 36 వేల మంది సిబ్బంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు.

లాక్ డౌన్..

కొవిడ్-19 మహమ్మారి సోకుతున్న నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడంలో జీహెచ్​ఎంసీ సఫలం అయింది. లాక్ డౌన్ పిరియడ్‌లో కరోనాను అరికట్టడంలో ఫ్రంట్ లైన్ వారియర్స్​గా ఉన్న జీహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతిరోజూ రెండు పూటల 50వేల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించింది. నిరాశ్రయులకు 19 షెల్టర్ల ద్వారా ఆశ్రయం కల్పించింది.

ఎస్ఆర్డీపీ కార్యక్రమాలు..

వ్యూహాత్మక రోడ్ల అభివ‌ృద్ధి కార్యక్రమం మొదటి దశలో భాగంగా 26 ప్రధాన రోడ్లను విస్తరించి ఆయా మార్గాల్లో మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు, ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేసి సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ కు బాటలు వేసింది. ఇందులో భాగంగా 7 స్కై వేలు, 11 మేజర్ కారిడార్లు, 68 మేజర్ రోడ్స్, 54 గ్రేడ్ సపరేటర్లను చేపట్టింది. వీటిలో రూ. 1010.77 కోట్ల వ్యయంతో 9 ఫ్లైఓవర్లు, నాలుగు అండర్ పాస్ లు, మూడు ఆర్ఓబీ/ఆర్ యూబీ, కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలను పూర్తిచేశారు. రూ. 4741.97 కోట్ల వ్యయం చేపట్టిన మరో 20 అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. రూ. 2,310 కోట్ల వ్యయంతో ఐదు ప్రాజెక్ట్ ల డీపీఆర్​లు సిద్ధంగా ఉన్నాయి. రోడ్ నెం-45 జూబ్లీహిల్స్, ఎల్బీనగర్ జంక్షన్, నాగోల్ జంక్షన్, బయోడైవర్సిటీ జంక్షన్లకు భూసేకరణ జరిపి నిర్మాణాలను 2020 లో పూర్తిచేసింది. వీటితో పాటు అంబర్ పేట్, బాలానగర్, ఉప్పల్ రహదారుల విస్తరణను రోడ్లు, భవనాల శాఖ, హెచ్ఎండీఏతో కలిసి చేపట్టింది.

లింక్ రోడ్ల నిర్మాణం..

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులకు కనెక్టివిటీ పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి మిస్సింగ్ లింక్ రోడ్లను చేపట్టింది. మొదటి దశలో భాగంగా 37 మిస్సింగ్ రోడ్లను గుర్తించి వీటికి సంబంధించిన భూమి, ఆస్తుల సేకరణను పూర్తిచేసి ఈ రోడ్ల నిర్మాణాలను చేపట్టింది. వారసత్వ కట్టడాల పునరుద్ధరణ, పరిరక్షణలో భాగంగా రూ. 12 కోట్ల వ్యయంతో ఎంజే మార్కెట్ పునరుద్ధరణ పనులను పూర్తిచేసింది. అలాగే ప్రధాన జంక్షన్లు, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ కల్పించడం, జంక్షన్ల సుందరీకరణ, రోడ్ల విస్తరణ చేసేందుకు నగరంలోని 16 ప్రధాన జంక్షన్ల అభివృద్దిని చేపట్టింది.

చార్మినార్

పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ లో భాగంగా హైదరాబాద్ లోని చార్మినార్ ను స్వచ్ఛ భారత్ మిషన్ ప్రత్యేక స్వచ్ఛ ఐకానిక్ కట్టడంగా ప్రకటించింది. దీనిలో భాగంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తాగునీరు, శానిటేషన్ తదితర కార్యక్రమాలు చేపట్టారు.

వెటర్నరీ విభాగంలో వినూత్నంగా

అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.1.10 కోట్ల వ్యయంతో దేశంలోనే మొట్టమొదటి డాగ్ పార్క్ ను శేరిలింగంపల్లి జోన్ లోని కొండాపూర్ లో 1.30 ఎకరాల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ నిర్మించింది. వీధి శునకాల జననాలను నియంత్రించడం, రేబిస్ వ్యాధిని అరికట్టేందుకు బల్దియా చేపట్టిన ఎనిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబిస్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో 5 ప్రత్యేక ఎనిమల్ కేర్ సెంటర్లను నిర్వహిస్తోంది.

మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు..

టాయిలెట్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా నగరంలో మొట్టమొదటిసారిగా మూడు మొబైల్ టాయిలెట్లను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. ఒక్కో మొబైల్ టాయిలెట్ లో మూడు మహిళలకు, మూడు పురుషులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్ల నిర్వహణకు రెవెన్యూ సమకూర్చుకునేందుకు వీటికి కమర్షియల్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. సుచిత్ర జంక్షన్, మూసాపేట్, కూకట్ పల్లి సర్కిళ్లలో ఏర్పాటు చేశారు. ప్రతీ జోన్ కు ఐదు మొబైల్ టాయిలెట్ల చొప్పున జీహెచ్ఎంసీ పరిధిలో30 మొబైల్ టాయిలెట్లను రూ.1.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఆర్టీసీ నుంచి 30 బస్సులను సేకరించింది. అలాగే బహిరంగ మలమూత్ర విసర్జన లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుతం ఉన్న టాయిలెట్లకు అదనంగా కొత్తగా 8,400 సీటింగ్ ఉండేవిధంగా 4,225 టాయిలెట్లను ఏర్పాటు చేశారు.

సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్ట్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన రహదారులను కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహించేందుకు సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్ట్ జీహెచ్ఎంసీ చేపట్టింది. బల్దియా పర్యవేక్షణలో జరిగే ఈ సీఆర్ఎంపీ పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి రూ.1839 కోట్ల వ్యయంతో 709.49 కిలోమీటర్ల రహదారులను ఐదేళ్ల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 300 కిలోమీటర్ల (1200 లేన్ కిలో మీటర్స్) పొడవు గల రహదారులను రూ. 384 కోట్ల వ్యయంతో రీకార్పెటింగ్, ఫుట్ పాత్ నిర్వహణ, లెన్ మార్కింగ్, స్వీపింగ్, గ్రీనరీ నిర్వహణ తదితర పనులను ఏజెన్సీలు చేపట్టాయి. కొవిడ్-19 మహమ్మారితో దేశవ్యాప్త లాక్ డౌన్ ఉన్నప్పటికీ 2020 మార్చి 21వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 31వ తేదీ వరకు నగరంలోని ప్రధాన రోడ్ల రీకార్పెటింగ్ పనులను పూర్తి చేసింది.

దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం

దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో కేబుల్ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ నిర్మించింది. 735.639 మీటర్ల పొడవు గల ఈ బ్రిడ్జి నిర్మాణంతో హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ట్ తో పాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఏర్పడింది. ముఖ్యంగా మాదాపూర్ రోడ్, జూబ్లీహిల్స్, రోడ్ నెం.36 లో ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. నగరానికి నగిషీగా మారిన ఈ కేబుల్ బ్రిడ్జి నగర పర్యాటక రంగానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డబుల్ బెడ్ రూం ఇళ్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఇప్పటికే సింగం చెరువు తండా, సయ్యద్ సాబ్ కా బాడా, కిడికి బూద్ ఎలిసా, చిత్తారమ్మ బస్తీ, ఎరుకల నాంచారమ్మ బస్తీ, వనస్థలిపురం రైతు బజార్ లలోని డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

శ్మశాన వాటికల ఆధునీకరణ

నగరంలో 31 శ్మశానవాటికలను రూ. 42.66 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. జూబ్లీహిల్స్ లో ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో నిర్మించిన మహాప్రస్థానం మాదిరిగానే శ్మశానవాటికలన్నింటిలో ఆధునిక పద్ధతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 25 పనులు పూర్తి కాగా మరో 5 గ్రేవ్ యార్డ్ ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.

మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు..

గ్రేటర్ హైదరాబాద్ లో పేదలు సైతం ఉన్నత ప్రమాణాలు కలిగిన ఫంక్షన్ హాళ్లలో వివాహాలు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవడానికి జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 34 కోట్ల వ్యయంతో 14 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో ఇప్పటికే రూ.14.30 కోట్ల వ్యయంతో ఐదు ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. మరో ఐదు ఫంక్షన్ హాళ్ల నిర్మాణం రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. మిగిలిన నాలుగు వివిధ స్థాయిలో ఉన్నాయి.

పురాతన కట్టడాలకు మహర్దశ..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పురాతన వారసత్వ కట్టడాల పునరుద్ధరణ, సుందరీకరణ పనులను బల్దియా చేపట్టింది. దీనిలో భాగంగా చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ తో సహా ఎనిమిది వారసత్వ కట్టడాలను రూ. 56.67 కోట్ల వ్యయంతో మరమ్మతు చేపట్టారు. చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ కు రూ. 51 కోట్ల వ్యయంతో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం, చార్మినార్ చుట్టూ పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు నగరంలోని పురాతన క్లాక్ టవర్ల పునరుద్ధరణ పనులు చేశారు. అలాగే చారిత్రాత్మక మొజంజాహి మార్కెట్ ను రూ.15 కోట్లతో పునరుద్ధరించారు.

పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం

ఇప్పటికే నగరంలో ఉన్న 316 పెట్రోల్ బంక్ లలో టాయిలెట్లు, అన్ని ప్రధాన హోటళ్లలోని టాయిలెట్లను ప్రజలు ఉపయోగించుకునేందుకు జీహెచ్ఎంసి వెసులుబాటు కలిగించింది. ఇప్పటికే నగరంలో 210 బి.ఓ.టి టాయిలెట్లు, 113 ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు, 48 షీ టాయిలెట్లు, 16 మెట్రో టాయిలెట్లు, 10 లూ-కేఫే టాయిలెట్లు ఉన్నాయి. వీటికితోడు జోన్ కు ఐదు చొప్పున 30 మొబైల్ బస్ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు.

చెత్త తరలింపునకు ఆధునిక వాహనాలు..

నగరంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫర్ స్టేషన్ల స్థానంలో ఆధునిక పద్ధతిలో 60 సెంకడరీ కలెక్షన్, ట్రాన్స్ పోర్ట్ పాయింట్లను (ఎస్.సి.టి.పి) లను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించింది. ఈ కేంద్రాల నుంచి మున్సిపల్ వ్యర్థాలను తరలించేందుకు 35 జి.వి.డబ్ల్యూ సామర్థ్యం గల 55 బెంజ్ వాహనాలను, 61 పోర్టబుల్ సెల్ఫ్ కంప్యాక్టర్లు, 16 హై కెపాసిటీ ఆటోమెటెడ్ స్టాటిక్ కంప్యాక్టర్లు, 65 హై కెపాసిటీ సీల్డ్ కంటైనర్లను జీహెచ్ఎంసీ సమకూర్చుకుంది.

హరితహారం..

గ్రేటర్లో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2.08 కోట్ల మొక్కలను పంపిణీ, నాటడం జరిగింది. నగరంలోని 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్ ను చేపట్టారు. 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్ లు, 66 ట్రాఫిక్ ఐ-లాండ్ లు, 18 ఫ్లైఓవర్లు, 327 ట్రీ పార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

18 స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణం..

హైదరాబాద్ లో క్రీడాకారులను ప్రోత్సహించేలా వారికి కావాల్సిన సౌకర్యాల కల్పనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, ఇండోర్ స్టేడియం , ప్లేగ్రౌండ్ ల నిర్మాణం రూ. 89.53 కోట్ల వ్యయంతో చేపట్టింది. వీటిలో ఇప్పటికే 7 స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన 11 స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల పనులు వివిధ దశలో ఉన్నాయి.

బస్తీ దవాఖానలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు బస్తీ దవాఖానలను ప్రారంభించారు. 2018 లో ప్రారంభమైన ఈ బస్తీ దవాఖానలు ప్రస్తుతం 225 కు పైగా పనిచేస్తున్నాయి. ప్రతీ బస్తీ దవఖానాలో సుమారు 80 నుంచి 90 మంది ప్రాథమిక చికిత్స కోసం వస్తున్నారు.

ఐదు రూపాయల భోజనం..

గ్రేటర్ లో ప్రారంభించిన ఐదు రూపాయల భోజన పథకం-అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 35 వేల మందికి భోజనాలు అందజేస్తున్నారు. లాక్ డౌన్ సందర్భంగా 373 కేంద్రాలు 259 మొబైల్ కేంద్రాల ద్వారా ఉచితంగా భోజనాన్ని అందజేశారు. 2020 -21 ఆర్థిక సంవత్సరంలో 1,76,14,332 మందికి ఐదు రూపాయల భోజనాన్ని అందజేశారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో17 నైట్ షెల్టర్లను నిర్వహిస్తున్నారు. అన్ని నైట్ షెల్టర్లలో ప్రతి రోజు 650 మందికి ఆశ్రయం కల్పిస్తున్నారు.

యూసీడీ విభాగం…

సిటీ పరిధిలో ఉన్న 45,629 స్వయం సహాయక బృందాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 85 కోట్ల రుణాలు అందించారు. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా రూ. 4.23 కోట్ల వ్యయంతో 596 మందికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించారు. నగరంలో 1,45,090 వీధి వ్యాపారులకు సర్వే చేసి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు 30కి పైగా టౌన్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం 1,655 మందికి ఆసరా గుర్తింపు కార్డులు జారీచేశారు. 2015 మంది దివ్యాంగులకు వికాసం కార్డులను అందజేశారు. దివ్యాంగులకు చెందిన ఆరు స్వయం సహాయక బృందాలను కొత్తగా ఏర్పాటు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45 గ్రూపులకు రూ. 8.44 కోట్ల రుణాలిచ్చారు.


Next Story